హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 10వ సీజన్లో ఎప్పుడు అరంగేట్రం చేస్తాడో అనే దానిపై స్పష్టతనిచ్చాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్లో కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో '120 శాతం ఫిట్నెస్ ఉంటేనే ఐపీఎల్లో ఆడతాను' అని కోహ్లీ గతంలో ప్రకటించాడు. దీంతో ఐపీఎల్ 10వ సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫిటెనెస్ సాధించలేకపోయాడు. తాజాగా విరాట్ కోహ్లీ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిటెనెస్ సాధించినట్లు కనిపిస్తోంది.
జిమ్లో అలవోకగా బరువులను ఎత్తేస్తున్న వీడియోని సోషల్ మీడియా ద్వారా కోహ్లి అభిమానులతో పంచుకున్నాడు. 'మైదానంలో తిరిగి ఎప్పుడు అడుగు పెడతానా అని ఎదురుచూస్తున్నా. దాదాపుగా ఫిటెనెస్ సాధించేశాను. అన్నీ కుదిరితే మార్చి 14న (శుక్రవారం) మీ ముందుకు వస్తా' అంటూ తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.
ఏప్రిల్ 14న రాయల్ ఛాలెంజర్స్ తన సొంతమైదానం చిన్నస్వామిలో ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఇప్పటికే కోహ్లీ లేకుండానే బెంగళూరు జట్టు వాట్సన్ నాయకత్వంలో మూడు మ్యాచ్లు ఆడేసింది. తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన బెంగళూరు.. ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన రెండో మ్యాచ్లో పోరాడి విజయం సాధించింది.
Can't wait to get back onto the field. Almost there now 💪✌️😃. 14th April ⏳
A post shared by Virat Kohli (@virat.kohli) on
కాగా, సోమవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ మెరుపులు మెరిపించినా.. బెంగళూరు ఓటమి పాలైంది. సోమవారం నాటి మ్యాచ్లో 360 డిగ్రీల ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫామ్లోకి రావడంతో ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపాడు. ఏబీకి తోడు కోహ్లీ కూడా బరిలోకి దిగితే బెంగళూరు అభిమానులకు పండగే.