హైదరాబాద్: తనతో ఎవరూ పోటీపడలేరని, తనకు తానే పోటీ అని కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ చెబుతున్నాడు. బుధవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో భారత జట్టుకు ఎంపికవుతారనే ఆశ ఉందా? అని అడిగిన ప్రశ్నకు పఠాన్ స్పందించాడు.
'నాకన్నా ఎవరు ముందున్నారనేది నాకు అనవసరం. ఎవరూ నాతో పోటీ పడలేరన్నది నా ఉద్దేశం. నాకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఎవరికి నేను పోటీ కాదు' అని అన్నాడు. ఎప్పుడూ భయపడనని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాజ సిద్దమైన ఆటనే ఆడటానికే ఇష్ట పడుతానని పఠాన్ వ్యాఖ్యానించాడు.
ఫాంలోకి వచ్చానని, ఇలానే తన ఆటను కొనసాగిస్తే భారత్ జట్టులో ఎప్పుడైనా అవకాసం రావొచ్చని తెలిపాడు. 'నా ప్రతిభను నేను నమ్ముకోవాలి. పరిస్థితులు మారడానికి పెద్దగా సమయం పట్టదు. మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తే ఈ రోజు లేదా రేపు కాకున్నా ఏదో ఒక దశలో మళ్లీ భారత జట్టులో చోటు సంపాదిస్తా. నేను ఇతరులను పట్టించుకోనని, మంచి క్రికెట్ ఆడటమే నా కర్తవ్యం' అని పఠాన్ చెప్పాడు.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహజ సిద్దమైన ఆటనే ప్రదర్శిస్తానని, ఢిల్లీ మ్యాచ్లో అలానే ఆడానని యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో చాలా ఒత్తిడి సమయంలో బ్యాటింగ్కు వెళ్లానని చెప్పాడు. తొలి బంతి అయినా, 40వ బంతైనా నా షాట్లో మార్పు ఉండదని యూసఫ్ చెప్పాడు.
ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఢిల్లీ డెర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో యూసఫ్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2011 నుంచి కోల్కతా జట్టు తరుపున ఆడుతున్న పఠాన్ ఇప్పటి వరకు 111 మ్యాచ్ లాడాడు.