సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు సాధించింది. డేవిడ్ వార్నర్ (54 బంతుల్లో 70 నాటౌట్; 7×4, 2×6) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్.. 19.4 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ వోహ్రా (50 బంతుల్లో 95; 9ఫోర్లు, 5 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్తో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది.
ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన భువీ
భువనేశ్వర్ (5/19) ఐదు వికెట్లతో ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేశాడు. రషీద్ఖాన్ 2 వికెట్లు, సిద్దార్థ్ కౌల్, మహమ్మద్ నబీ, హెన్రిక్స్ తలా ఒక్కో వికెట్ తీశారు. అంతకముందు సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 7 ఫోర్లు 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.
నిరాశపరిచిన ఓపెనర్ శిఖర్ ధావన్
ఈ మ్యాచ్లో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నిరాశపరిచాడు. 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో 25 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్ 9 పరుగులకే పెవిలియన్కు చేరాడు. అక్షర్ పటేల్ వేసిన 10వ ఓవర్ తొలి బంతికే హెన్రిక్స్ పెవిలియన్కు చేరగా, ఆ తర్వాతి బంతికే ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.
నమన్ ఓజా 20 బంతుల్లో 34
ఈ దశలో క్రీజులోకి వచ్చిన నమన్ ఓజా (20 బంతుల్లో 34; రెండు ఫోర్లు, ఒక సిక్సు)తో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్లో ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన ఇషాంత్ కేవలం 23 పరుగులు ఇచ్చాడు. పంజాబ్ బౌలర్లలో మోహిత్శర్మ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా సందీప్ శర్మ, కరియప్ప చెరో వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో తడబడిన పంజాబ్
160 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ ఆదిలో తడబడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఆమ్లా(0)..భువనేశ్వర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిరావడంతోనే కెప్టెన్ మ్యాక్స్వెల్ (10) ఫోర్తో దూకుడు ప్రదర్శించాడు. మరోవైపు ఓపెనర్ మనన్ వోహ్రా(95) మొదటి నుంచే దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు.
బౌండరీలతో చెలరేగిన మనన్ వోహ్రా
సహచర బ్యాట్స్మెన్ నుంచి సహకారం లేకపోయినా..తనదైన రీతిలో బౌండరీలతో చెలరేగుతూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. వోహ్రా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో క్రీజులో నిలదొక్కుకుంటే..మరోవైపు మిగతా బ్యాట్స్మెన్ పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో ఏ దశలోనూ మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయింది. దీనికి తోడు రషీద్ఖాన్ స్పిన్ మాయతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
సెంచరీ మిస్
ఆ తర్వాత వోహ్రా సెంచరీ దిశగా దూసుకెళుతూ మెరుపులు మెరిపించాడు. హైదరాబాద్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ బౌండరీలతో హడలెత్తించాడు. అయితే ఆఖర్లో భువనేశ్వర్ మాయాజాలం చేశాడు. అప్పటికే సెంచరీ దిశగా సాగుతున్న వోహ్రాను 18.3వ ఓవర్లో భువీ ఔట్ చేసి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత 11 పరుగులు చేయాల్సిన దశలో సందీప్ శర్మ, ఇషాంత్లు కలిసి 6 పరుగులకే పరిమితమవడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు.