హైదరాబాద్: ఐపీఎల్లో అరంగేట్రం చేయాలన్న మహ్మద్ సిరాజ్ కోరిక ఢిల్లీ డేర్ డెవిల్స్తో ఉప్పల్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో జరిగింది. మ్యాచ్ అనంతరం మహ్మద్ సిరాజ్ మాట్లాడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కిందని తెలియగానే మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనయ్యానని చెప్పాడు.
'రాత్రికి ఢిల్లీతో మ్యాచ్ అనగా.. ఉదయాన్నే నాకు సమాచారం అందింది. దీంతో మానసికంగా ఐపీఎల్ అరంగ్రేటం మ్యాచ్కి సిద్ధమయ్యాను. తొలి మ్యాచ్ కావడంతో కొంచెం ఒత్తిడికి కూడా గురయ్యాను. ఒత్తిడిని జయించినప్పుడే కదా విజేతగా నిలవగలం అని సర్ది చెప్పుకున్నాను. జట్టులోని సీనియర్లు ఆశిష్ నెహ్రా, భువనేశ్వర్ కుమార్ నుంచి చాలా నేర్చుకుంటున్నాను' అని అన్నాడు.
తొలి మ్యాచ్లో రెండు వికెట్లు తీశానని, కొన్ని పరుగులిచ్చి తడబడ్డానని అన్నాడు. రెండో మ్యాచ్లో ఆ తప్పిదాలను సరిదిద్దుకుంటానని సిరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించిన వేలంలో రూ. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ని కోనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 2.60 కోట్లు వెచ్చించి కోనుగోలు చేసింది. దేశవాళీ టోర్నీల్లో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే సన్రైజర్స్ తుది జట్టులో చోటు కోసం సిరాజ్ ఐదు ఐపీఎల్ మ్యాచ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.