హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని ఓ విషయంలో నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలో మహేంద్ర సింగ్ ధోనియే పైచేయి సాధించాడు. పదేళ్ల ఐపీఎల్ని పురస్కరించుకుని నిర్వాహకులు ట్విటర్లో ప్రముఖ ఆటగాళ్ల ఎమోజీలు ప్రవేశపెట్టారు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
మ్యాచ్ల సందర్భంగా అభిమానులు వీటిని పోటాపోటీగా వినియోగిస్తున్నారు. అంతేకాదు తమ అభిమాన ఆటగాడి ఎమోజీ ఫోటోతో హ్యాష్ టాగ్ చేస్తారు. గత నాలుగు వారాలుగా ధోని ఎమోజీ ట్వీటర్లో అగ్రస్థానంలో ఉంది. ఐపీఎల్ పదో సీజన్ ఆరంభంలో కోహ్లీ టాప్లో కొనసాగినా, ఆ తర్వాత ధోని కోహ్లీని వెనక్కినెట్టాడు.
ఈ వారంలో కోల్కతా సారథి గౌతమ్ గంభీర్ రెండో స్థానం ఆక్రమించాడు. వరుస వైఫల్యాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ అర్హత కోల్పోవడంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, పూణె ఆల్ రౌండర్ బెన్స్టోక్స్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
అంతేకాదు ట్విటర్లో ఎక్కువగా చర్చించిన వ్యక్తి కూడా ధోనీయే కావడం విశేషం. గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్ గురించి అభిమానులు ఎక్కువగా చర్చించారు. కాగా పదో సీజన్ ప్రారంభానికి ముందు పూణె యాజమాన్యం కెప్టెన్గా ధోనిని తొలిగించి స్టీవ్ స్మిత్ను నియమించిన సంగతి తెలిసిందే.