హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు గేముల్లో నాలుగింటిలో పరాజయం పాలై అటు క్రికెట్ అభిమానులతో పాటు మాజీలను సైతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిరాశ పరిచింది. ఈ క్రమంలో బెంగళూరు జట్టు పుంజుకోవాలంటే క్రిస్ గేల్ను ఆడించాలని కెప్టెన్ కోహ్లీకి సౌరవ్ గంగూలీ సలహాయిచ్చాడు.
అంతేకాదు ఐపీఎల్ ప్లేఆఫ్స్ అవకాశాలను ఇప్పటికే ఇప్పటికే క్లిష్టంగా మార్చుకున్న కోహ్లీ సేన మరింత శ్రమించాలని సూచించాడు. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్గేల్ను ఆడించాలని, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ను తప్పించాలని కూడా కోహ్లీకి సూచించాడు.
తద్వారా బెంగళూరు మళ్లీ పుంజుకుంటుందని గంగూలీ విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. 'ఆర్సీబీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో గేల్ లాంటి ఆటగాడు జట్టుకు చాలా అవసరం. అతడిని బెంచ్కే పరిమితం చేయరాదు. గేల్ను మళ్లీ ఆడించాలి. ఆల్ రౌండర్ అని వాట్సన్ను ఆడిస్తున్నారు. కానీ అతడు పెద్దగా రాణించలేదు' అని గంగూలీ పేర్కొన్నాడు.
'బ్యాటింగ్ ఆర్డర్ లోనూ మార్పులు చేయాలి. డివిలియర్స్ను ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్కు దింపితే ఫినిషర్గా ఉపయోగపడతాడు. ఈ విధంగా చేయడం వల్లే గత సీజన్లో ఆర్సీబీ సత్తా చాటింది' అని గంగూలీ పేర్కొన్నాడు.
గత సీజన్లో ఆర్సీబీ ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదింటిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత బెంగళూరు ఆడిన చివరి 7 లీగ్ మ్యాచుల్లో ఆరింట్లో గెలిచి ప్లేఆప్ చేరిందని, అదేవిధంగా ఈ సీజన్లో కూడా పుంజుకుంటుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడిన బెంగళూరు కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. రాజ్కోట్ వేదికగా మంగళవారంజరిగే మ్యాచ్లో గుజరాత్ లయన్స్తో తలపడనుంది.