హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ తుది అంకానికి చేరుకున్న వేళ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం వెలుగుచూసింది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కాన్పూర్లో ముగ్గురు బుకీలను గురువారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే బెట్టింగ్ వ్యవహారంలో ఘజియాబాద్లో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి బెట్టింగ్ నిర్వహిస్తున్న వీరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 70 వేలు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కాగా గత బుధవారం కాన్పూర్లో గుజరాత్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సయినట్టు ఉత్తర ప్రదేశ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఫిక్సింగ్ ఉదంతాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది. పోలీసుల కంటే ముందే బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ జరుపుతోందని బోర్డు స్పష్టం చేసింది.
ఈమేరకు కాన్పూర్ పోలీసులు ఓ బుకీతోపాటు అతడి ఇద్దరు సహచరులను గురువారం అరెస్ట్ చేశారు. కాన్పూర్లోని ల్యాండ్మార్క్ హోటల్లో బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.40.90 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు కాన్పూర్ ఎస్పీ వెల్లడించారు.
Uttar Pradesh: Five bookies arrested with Rs 70,000 from Ghaziabad, seven mobiles also seized pic.twitter.com/XACu6WPFf5
— ANI UP (@ANINewsUP) 13 May 2017
థానెకు చెందిన వ్యా పారవేత్త రమేష్ నయన్ షా, కాన్పూర్కు చెందిన రమేష్ కుమార్, వికాస్ చౌహాన్ అరెస్టయిన వారిలో ఉన్నారు. తనతో నిరంతరం టచ్లో ఉన్న ఇద్దరు గుజరాత్ లయన్స్ క్రికెటర్ల పేర్లను విచారణ సందర్భంగా రమేష్ షా వెల్లడించినట్టు తెలుస్తోంది.
లయన్స్ ఆటగాళ్లలో ఇద్దరిని 'సెట్' చేశానని, అవసరమైన 'పని' చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు వాట్సప్ మెసెజ్ కూడా పంపానని విచారణ సందర్భంగా షా వెల్లడించినట్టు సమాచారం. అంతేకాదు 200 పరుగులు చేసి కూడా గుజరాత్ మ్యాచ్ ఓడిపోతుందని మెసెజ్లో పేర్కొన్నట్టు తెలిసింది.
దాంతో ఆ ఇద్దరు ఆటగాళ్లపై దృష్టి పోలీసులు దృష్టిసారించారు. షా, వికాస్లను హోటల్లోని 17వ అంతస్తు రూమ్నుంచి, మూడో వ్యక్తి రమేష్ను గ్రీనపార్క్ స్టేడియంలో అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. కాగా ఐపీఎల్లో ఓ రవాణా విభాగానికి రమేష్ కుమార్ సబ్ కాంట్రాక్టర్గా ఉన్నాడు.
తనకు గ్రీనపార్క్ గ్రౌండ్స్మెన్ తెలుసునని, అవసరమైన విధంగా పిచ్పై అధికంగా నీరు చల్లేందుకు సహకరిస్తారని బుకీ షాకు హామీ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే బుధవారం నాటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 196 పరుగులు చేసింది. 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినఢిల్లీ చివరి ఓవర్లో విజయం సాధించింది.
ఐపీఎల్లో ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూడటం ఇదే మొదటిసారి కాదు. 2013లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చౌహాన్, అజిత్ చండీలాలను స్పాట్ఫిక్సింగ్ ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ అల్లుడైన గురునాథ్ మేయప్పన్ను అరెస్ట్ చేయడం అప్పట్లో పెను సంచలనమైంది.
ఆ తర్వాత రాజస్థాన్, చెన్నై ఫ్రాంచైజీలను ఐపీఎల్నుంచి రెండేళ్ల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే.