హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ ప్రతి ఏడాదీ అమాంతం పెరుగుతోంది. ఐపీఎల్ పదో సీజన్లో వీక్షకుల సంఖ్య పెరగడంతో బ్రాండ్ విలువ దాదాపు రూ.34 వేల కోట్లకు చేరింది.
ఐపీఎల్ 10వ సీజన్ గురించి పూర్తి సమాచారం కోసం
అంతకముందు ఏడాదితో పోలిస్తే ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏకంగా 26 శాతం పెరగడం విశేషం. ప్రముఖ కార్పొరేట్ ఫైనాన్స్ సలహా సంస్థ డఫ్ అండ్ ఫెల్ప్స్ ఈ మేరకు ఐపీఎల్ విలువను లెక్కకట్టింది. గతేడాది ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 26వేల కోట్లుగా పేర్కొంది.
మొత్తంగా చూస్తే ఐపీఎల్ బ్రాండ్ విలువతో పాటు టోర్నీలో పాల్గొన్న జట్ల బ్రాండ్ విలువలు కూడా పెరిగాయని డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్ధ ఎండీ వరుణ్ గుప్త అన్నారు. రూ.678 కోట్లతో ముంబై ఇండియన్స్ జట్టు అగ్రస్ధానంలో ఉండగా, రూ.634 కోట్లతో కోల్కతా నైట్రైడర్స్ జట్టు రెండో స్థానంలో నిలిచింది.
రూ. 563 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఐపీఎల్ మ్యాచ్లు చూసేవాళ్ల సంఖ్య 45 శాతానికి పెరగడం, ప్రకటనలు, స్పాన్సర్షిప్, బ్రాడ్కాస్టింగ్ వల్ల బ్రాండ్ విలువ పెరిగిందని డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్ధ నివేదికలో వెల్లడించింది.
అంతేకాదు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం వివో రూ. 2,200 కోట్లు చెల్లించడం కూడా బ్రాండ్ విలువ పెరిగేందుకు దోహదపడిందని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ ప్రాంఛైజీలు విలువ కూడా యావరేజిగా 34 శాతం పెరిగాయని నివేదికలో పేర్కొంది.