ముంబై: జనవరి 13 నుంచి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించ తలపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండు రోజుల వర్క్షాప్ను ముంబైలో నిర్వహించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూతే ఈ మార్పునకు కారణమన్నారు. దేశానికి తొలి ముస్లిం హోంమంత్రిగా సేవలందించిన ముఫ్తీ మహ్మద్ సయీద్ గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 12వ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీ మహ్మద్ సయీద్ 2015 మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.
పీడీపీ వ్యవస్థాపకుడైన ముఫ్తీ మహ్మద్ సయీద్ కాశ్మీర్ సీఎంగా రెండోసారి ఆ పదవిని చేపట్టారు. ఇది ఇలా ఉంటే ఓ కాశ్మీర్ రాజకీయ నేత ముఖ్యమంత్రి హోదాలో కన్నుమూయడం ఇది రెండోసారి. 1982లోనూ అప్పటి కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా కూడా సీఎం హోదాలోనే కన్నుమూశారు.
ముఫ్తీ మహ్మద్ సయీద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపంగా గురువారం ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సెలవు ప్రకటించారు. కాగా, ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ముఫ్తీ పార్దీవదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.