బెంగళూరులో జననం
కర్ణాటకకు చెందిన అనిల్ కుంబ్లే అసలుపేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. 1970, అక్టోబరు 17న బెంగళూరులో కృష్ణస్వామి, సరోజ దంపతులకు జన్మించాడు. 1990లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు. చిన్నతనం నుంచే కుంబ్లేకు క్రికెట్పై మక్కువ ఉండేది. బెంగళూరు వీధుల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. 13 ఏళ్ల ప్రాయంలోనే యంగ్ క్రికెటర్స్ క్లబ్లో చేరాడు. కుంబ్లేకి దినేశ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అనతికాలంలోనే జట్టులో కీలక స్పిన్నర్గా ఎదిగిన కుంబ్లే కెరీర్లో టీమిండియాను ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు.
మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా
ఇండియాలో ఉన్న హై క్వాలిఫైడ్ క్రికెటర్లలో ఒకరు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా పొందారు. అంతేకాదు 500కు పైగా వికెట్లు తీసుకుని 2000కు పైగా పరుగులు చేసిన రెండో బౌలర్. ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో 500కు పైగా వికెట్లు తీసుకుని 2000కు పైగా పరుగులు చేశాడు. 132 టెస్టుల్లో 619 వికెట్లను కుంబ్లే తీసుకున్నాడు.
132 టెస్టు మ్యాచ్లాడి 619 వికెట్లు
1989 నవంబర్లో ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడిన కుంబ్లే 4 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత అండర్-19 జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి సెంచరీ సాధించాడు. 1990 ఏప్రిల్ 5న మొదటిసారిగా శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏటా ఇంగ్లాండ్పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత భారత్లో జరిగిన 3 టెస్టుల సిరీస్లో 19.8 సరాసరితో 21 వికెట్లు సాధించాడు. 18 ఏళ్ల తన క్రీడా జీవితంలో మొత్తం 132 టెస్టు మ్యాచ్లాడి 619 వికెట్లు తీశాడు. ఇక 271 వన్డేల్లో 337 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన బౌలర్లు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకర కుంబ్లే కాగా మరొకరు ఇంగ్లాండ్ స్పిన్నర్ జిమ్ లేకర్.
అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన భారత బౌలర్
ఇన్నింగ్స్లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన భారతీయ బౌలర్ కుంబ్లే. 2004లో కపిల్దేవ్ రికార్డును అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్వార్న్ తర్వాత 600 వికెట్ల క్లబ్లో చేరిన రెండో బౌలర్ కుంబ్లే. వన్డేల్లో 300 వికెట్ల క్లబ్లో చేరిన రెండో బౌలర్.
కుంబ్లే ముద్దుపేరు జంబో
కుంబ్లేని టీమిండియా ఆటగాళ్లు ముద్దుగా 'ద జంబో' అని పిలుస్తుంటారు. తనకు జంబో అని ఎవరు పేరు పెట్టారో అనే విషయాన్ని ఫ్యాన్స్తో ట్విట్టర్లో చాటింగ్ చేసిన సందర్భంలో కుంబ్లే పంచుకున్నారు. ఇరానీ ట్రోఫీలో ఆడుతున్న సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు ఆ పేరు పెట్టారని వెల్లడించారు.
పది వికెట్లు తీసిన రెండు బౌలర్
పాకిస్థాన్తో 1999లో జరిగిన టెస్టు మ్యాచ్లో కుంబ్లే 74 పరుగులిచ్చి ఏకంగా పది వికెట్లు పడగొట్టాడు. 18ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్కు 2008లో వీడ్కోలు పలికాడు. 19ఏళ్ల వయసులోనే 1990లో మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రంజీల్లో కూడా తనదైన శైలిలో సత్తా చాటాడు. ఢిల్లీలో జరిగిన ఇరానీ ట్రోఫీలో 13 వికెట్లు తీసుకుని 138 పరుగులిచ్చాడు. దీంతో అతడిని సెలక్టర్లు దక్షిణాప్రికా పర్యటనకు ఎంపిక చేశారు. కుంబ్లే టాలెంట్ ఉన్న ఆటగాడు మాత్రమే కాదు, చదువులో కూడా టాపరే.
కెప్టెన్గా అనిల్ కుంబ్లే
అనిల్ కుంబ్లే టేస్టుల్లో 14 మ్యాచ్లకు నాయకత్వం వహించారు. వీటిలో భారత్ 3గెలిచి 5 ఓడగా 6 మ్యాచ్లు డ్రా అయ్యాయి. 5 టెస్టు సిరీస్ల్లో 2007 పాకిస్థాన్ సిరీస్, 2008 ఆస్ట్రేలియా సిరీస్లను భారత్ గెలిచింది. వన్డేల్లో ఒకె ఒక మ్యాచ్కు నాయకత్వం వహించగా ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
కోచ్గా భారత్కు అద్భుత విజయాలు
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక భారత జట్టు కోచ్గా కూడా అనిల్ కుంబ్లే తన సేవలందించాడు. అనిల్ కుంబ్లే కోచ్గా ఉన్న సమయంలోనే వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్తో వరుస టెస్టు సిరీస్లను భారత్ సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన భారత జట్టు పాకిస్థాన్ చేతిలో ఓడిన విషయం అందరికి తెలిసిందే. అనంతరం కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య అభిప్రాయబేధాలు రావడంతో కోచ్ పదవి నుంచి కుంబ్లే తనంతట తానే తప్పుకున్నాడు.