హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ ఖలీద్ లతీఫ్పై ఆ దేశ బోర్డు ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న కారణంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐదేళ్లపాటు అతడు అన్ని ఫార్మెట్లకు దూరం కానున్నాడు.
పీఎస్ఎల్ ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడిన ఖలీద్ పీసీబీ అవినీతి వ్యతిరేక నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించినట్టు ఆరు అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరు అభియోగాల్లోనూ అతను దోషిగా తేలడంతో పీసీబీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు లతీఫ్కు రూ. 10లక్షల జరిమానా విధించింది.
ఈ నిషేధం అన్ని పార్మాట్లకు వర్తిస్తుందని పీసీబీ పేర్కొంది. ముగ్గుల సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై సమగ్ర తీర్పు వెలువరించిన అనంతరం అతడికి 14 రోజుల్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. లతీఫ్ అప్పీల్ చేస్తాడా లేదా? అన్నది వేచిచూస్తామని పీసీబీ తరఫు న్యాయవాది తెలిపాడు.
అయితే తనపై విధించిన నిషేధంపై అప్పీల్ చేసే అవకాశం ఉందని లతీఫ్ తరఫు న్యాయవాది బాదర్ ఆలం తెలిపారు. 31 ఏళ్ల ఖలీద్ లతీఫ్ పాకిస్థాన్ తరుపున ఐదు వన్డేలు, 13 టీ20లు ఆడాడు. చివరిసారిగా సెప్టెంబర్ 2016లో వెస్టిండిస్తో అబుదాబిలో జరిగిన టీ20లో పాక్ తరుపున ఆడాడు.