తొలి సమావేశంలో కుంబ్లే
తొలి సమావేశంలో కుంబ్లే.. బీసీసీఐ ఉన్నతాధికారులు, సీఏసీ సభ్యులను కలుసుకున్నాడు. చర్చల సందర్భంగా విరాట్తో తనకు ఎలాంటి సమస్య లేదని అనిల్ పదేపదే చెప్పాడు. తన కోచింగ్పై కోహ్లీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, ఇవి పెద్ద సమస్యలు కావని తేల్చాడు. ఆ తర్వాత కోహ్లీ వారిని కలిశాడు. ఇక మూడో సమావేశంలో కుంబ్లే, కోహ్లీలను టేబుల్కు ఎదురెదురుగా కూర్చోపెట్టారు. ఏదైనా సమస్య ఉందా? అని అడిగినప్పుడు ఇద్దరూ భిన్న సమాధానాలిచ్చారు. కోహ్లీతో తనకేమీ ఇబ్బంది లేదని కుంబ్లే చెప్పాడని బోర్డు అధికారి తెలిపాడు.
కోహ్లీ అభ్యంతరాలు
అయితే అతడి పనితీరుపై కోహ్లీ అభ్యంతరాల గురించి చెప్పినప్పుడు 'అవి సమస్యలే కావు' అని కుంబ్లే చెప్పాడట. కానీ ఇద్దరూ మెట్టు దిగకపోవడం, వీళ్ల మధ్య అసలు మాటలు లేవని విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చివరకు తాము కలిసి కొనసాగడం కష్టమని కోచ్, కెప్టెన్ ఓ అభిప్రాయానికి రావడంతో బోర్డు కూడా చేతులెత్తేసింది. 'కోహ్లీ, కుంబ్లే మాట్లాడుకోవట్లేదు. కొన్ని సమస్యలున్నాయని తెలుసు. కానీ ఆరునెలలుగా మాట్లాడుకోవట్లేదని తెలిసి దిగ్భ్రాంతి చెందాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వారిని ఎదురు ఎదురుగా కూర్చోపెట్టాం. ఇద్దరూ కలిసి పనిచేయడం కుదరదు' అని తేల్చి చెప్పారని అధికారి వివరించాడు.
వ్యక్తిగత అంశాల్లోకి వస్తున్నాడని కోహ్లీ
కోచింగ్ పరంగా కఠినంగా ఉండే కుంబ్లే కొన్నిసార్లు హద్దులు మీరి వ్యక్తిగత అంశాల్లోకి వస్తున్నాడని కోహ్లీ భావించినట్లు మరో అధికారి వెల్లడించారు. కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో గత కొన్నాళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 'ఈ విషయంపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. ఇవి క్రికెటేతర అంశాలు కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పరిష్కరించలేనంతగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తన వ్యక్తిగత విషయాల్లోకి కుంబ్లే వస్తున్నాడని కోహ్లీ అహం దెబ్బతింది. కుంబ్లే గొప్ప ఆటగాడు. అతని నమ్మకాలు ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ మైదానంలో తుది నిర్ణయం మాత్రం కెప్టెన్కే ఉంటుంది కదా. దీనిని ఇద్దరూ అర్థం చేసుకోలేకపోయారు' అని బీసీసీఐ అధికారి తెలిపాడు.
బార్బడోస్ ప్రయాణానికి కుంబ్లే కోసం టికెట్లు
'ఇద్దరిలో ఒకరు సమస్యలున్నాయని భావించినప్పుడు.. ఆ సమస్యను వాళ్లే పరిష్కరించుకోగలరు. అయితే సమావేశంలో కూర్చున్న తర్వాత తమ మధ్య విభేదాలు పరిష్కరించలేని స్థితికి చేరుకున్నాయని ఇద్దరూ అర్థం చేసుకున్నారు. అప్పటికి బార్బడోస్ ప్రయాణానికి కుంబ్లే కోసం టికెట్లు బుక్ అయ్యాయి. అతడి భార్య కూడా అక్కడికి రావాల్సివుంది. అయితే కుంబ్లే కథ ముగిసింది' అని తెలియడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నాడని ఆ అధికారి తెలిపాడు.
ఫైనల్కు రెండు రోజుల ముందు కుంబ్లేని తిట్టిన కోహ్లీ
అంతేకాదు ఫైనల్కు రెండు రోజుల ముందు కూడా కుంబ్లేపై కోహ్లీ నోరు పారేసుకున్నాడు. కోచింగ్ శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నీవు కోచ్గా కొనసాగడానికి జట్టు సభ్యులెవరికీ ఇష్టం లేదని అందరి ముందు కుంబ్లేకి చెప్పినట్లు తెలిసింది. దీంతో కుంబ్లే మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు పాకిస్థాన్ చేతిలో ఫైనల్లో ఓడిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఓ అరగంటపాటు జట్టు సభ్యులకు కుంబ్లే క్లాస్ తీసుకున్నాడు. ఇది కూడా కోహ్లీకి నచ్చలేదు. వెస్టిండీస్ పర్యటనకు ముందే ఈ అంశంపై తాడోపేడో తేల్చుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఫలితంగా బీసీసీఐ ఎన్నిసార్లు రాజీ ప్రయత్నాలు చేసినా కోహ్లీ వెనుక్కు తగ్గకపోవడంతో కుంబ్లే రాజీనామా చేశాడు.