హైదరాబాద్: మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదే పదే కోపాన్ని ప్రదర్శించడం మంచిది కాదని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగా అభిప్రాయపడ్డాడు. ఒక ఆటగాడిగా ఇప్పటికే తానేమిటో కోహ్లీ నిరూపించుకున్నా... కెప్టెన్గా నిరూపించుకోవడానికి ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నాడు.
'ఆటగాడిగా కోహ్లి అత్యుత్తమ స్థాయిని చూశా. అయితే కెప్టెన్గా అతని ఏ రేటింగ్ ఇవ్వలేను. అతను కెప్టెన్గా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. ప్రతీసారి మైదానంలో కోహ్లీ కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అవసరమైన సందర్భాల్లో దూకుడు ఉంటే మంచిదని, ప్రతిదానికీ అదే తరహా వైఖరి కూడదు' అని రణతుంగ అన్నాడు.
ఒకవేళ పదేపదే కోహ్లీ కోపాన్ని తెచ్చుకుంటే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుందని రణతుంగ పేర్కొన్నాడు. అంతేకాదు టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, అజహరుద్దీన్లతో కోహ్లీకి పోలికలు వద్దని కూడా ఆయన సూచించారు. కపిల్తో మాత్రం కోహ్లీని పోల్చవచ్చని, అందుకు కూడా కోహ్లీ చాలా దూరంగానే ఉన్నాడని రణతుంగ పేర్కొన్నాడు.