టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆరంగ్రేటం టెస్టులోనే కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్లో 332 పరుగులు చేసి 32 పరుగుల ఆధిక్యం సాధించింది. కేఎల్ రాహుల్ 60, పూజారా 57, రహానే 46, రవీంద్ర జడేజా 63 పరుగులతో రాణించారు.
సమష్టిగా రాణించిన భారత్
ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్ బౌలర్లు సమష్టిగా రాణించి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 53.5 ఓవర్లు ఆడి 137 పరుగులకే ఆలౌటైంది. మాక్స్వెల్ చేసిన 45 పరుగులే ఆసీస్ బ్యాట్స్ మెన్లలో అత్యధిక స్కోరు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాట్స్మెన్లందరూ ఘోరంగా విఫలమయ్యారు.
భారత్కు 106 పరుగుల విజయలక్ష్యం
దీంతో భారత్కు 106 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్లు ఏమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. నాలుగో రోజు 19/0 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన భారత్కు రాహుల్ చక్కని ఆరంభాన్ని ఇచ్చాడు.
విరుచుకుపడ్డ ఓపెనర్ కేఎల్ రాహుల్
మురళీ విజయ్ నెమ్మదిగా ఆడుతుంటే రాహుల్ మాత్రం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సొగసైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భారత్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. విజయ్ 8 పరుగులు చేయగా, పుజారా డకౌట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రహానే చెలరేగాడు.
మొదటి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచిన రహానే
కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో రహానే మొదటి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. ఈ సమయంలో ఆసీస్ కెప్టెన్ భారత్ను ఒత్తిడికి గురి చేసేందుకు స్పిన్నర్ లియాన్ను దించాడు. కానీ భారత కెప్టెన్ రహానే, రాహుల్ రెచ్చిపోయి ఆడడంతో భారత్ సునాయస విజయం సాధించింది.
టెస్టుల్లో టీమిండియా జైత్రయాత్ర
దీంతో టెస్టుల్లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగించింది. అంతేకాదు స్వదేశంలో వరుసుగా ఏడు టెస్టు సిరిస్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ సీజన్ను టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుతో ముగించింది. స్వదేశంలో 2015 నుంచి భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.
స్వదేశంలో 25 టెస్టులు ఆడి 21 విజయాలు
ఈ సీజన్లో స్వదేశంలో 25 టెస్టులు ఆడిన టీమిండియా ఏకంగా 21 విజయాలు నమోదు చేసింది. ఇందులో రెండు టెస్టుల్లో ఓటమి పాలవ్వగా, మరో టెస్టులను డ్రాగా ముగించింది. ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక సీజన్లో 82 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇక కోహ్లీ స్థానంలో 33వ టెస్టు కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన రహానే తొలి విజయాన్ని అందుకున్నాడు.
ధర్మశాల టెస్టు స్కోర్లు:
తొలి ఇన్నింగ్స్:
ఆస్ట్రేలియా 300, భారత్ 332
రెండో ఇన్నింగ్స్:
ఆస్ట్రేలియా 137, భారత్ 106/2
మ్యాచ్ ఫలితం: 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం