హైదరాబాద్: మంచి జట్లను ఎంపిక చేశారన్న కారణంతో భారత మహిళా, పురుష సెలక్టర్లకు రూ. 15 లక్షల నగదు ప్రోత్సాహకాలను అందజేయడాన్ని టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ మదల్ లాల్ తప్పుబట్టారు. సెలక్టర్లు ఉన్నదే మంచి జట్లను ఎంపిక చేయడానికేనని అన్నారు.
అలాంటిది వారికి ప్రత్యేక ప్రోత్సాహాలివ్వాల్సిన అవసరం ఏముందని మదన్ లాల్ ప్రశ్నించాడు. 'ఉత్తమ జట్లను ఎంపిక చేసినందుకు సెలక్టర్లకు నజరానాలు ఇచ్చినట్లు చదివి ఆశ్చర్యపోయా. వాళ్ల బాధ్యతే ఉత్తమ జట్లను ఎంపిక చేయడమే తప్ప చెత్త జట్లను కాదు' అని ట్విట్టర్లో పోస్టు చేశాడు.
Surprised to read that selectors are getting reward 15 L to pick the best team.They suppose to pick the best team not bad team.correction
— Madan lal (@MadanLal1983) August 10, 2017
అయితే మదన్ లాల్ చేసిన వ్యాఖ్యల పట్ల బీసీసీఐ అధికారి ఒకరు తప్పుబట్టారు. భారత జట్లు మెరుగైన ప్రదర్శన చేసినప్పుడు ఆటగాళ్లతో పాటు సెలక్టర్లకు కూడా ప్రోత్సాహకాలు అందించిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయని ఆయన అన్నారు.
బుధవారం జరిగిన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్కప్లలో ఫైనల్కు చేరుకున్న పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసిన సెలక్టర్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని తీర్మానించిన సంగతి తెలిసిందే.
సెలక్షన్ కమిటీలలోని ఒక్కో సభ్యుడికి రూ. 15 లక్షల చొప్పున నజరానా అందజేయనున్నారు. మంచి జట్లను ఎంపిక చేసినందుకే వాళ్లకు ఈ బహుమతి అని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ తెలిపింది. దేశవాళీ క్రీడాకారుల జీతాల పెంపుపై బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరి మార్గదర్శకాలను రూపొందిస్తారని ఆమె పేర్కొన్నారు.