నాటింగ్హమ్: ఆస్టేలియా కెప్టెన్ మైఖెల్ క్లార్క్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నారు. యాషెస్ సిరిస్ ముగిసిన వెంటనే 34 ఏళ్ల మైఖెల్ క్లార్క్ క్రికెట్లో అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం క్లార్క్ ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల యాషెస్ సిరిస్లో ఆడుతున్నాడు.
ఆగస్టు 20 నుంచి 24 వరకు జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే క్లార్క్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతారని క్రికెట్ ఆస్టేలియా అధికారికంగా ప్రకటించింది. యాషెస్ సిరిస్లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్టేలియా మధ్య ట్రెంట్ బ్రిడ్జిలో నాల్గవ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
ఆసీస్ ఘోర పరాజయం: యాషెస్ ఇంగ్లాండ్ కైవసం
దీంతో యాషెస్ సిరిస్లో ఇంగ్లాండ్ 3-1తో సిరిస్ను కైవసం చేసుకుంది. 2004లో భారత్పై బెంగుళూరులో జరిగిన టెస్టు మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి మైఖెల్ క్లార్క్ అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరుపున 114 టెస్టులాడిన క్లార్క్ 8,000 పరుగులు సాధించాడు. 245 వన్డేలు, 34 టీ20ల ఆడిన అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇంగ్లాండ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సిరీస్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు శనివారంతో గెలుపు లాంఛనంగా పూర్తి చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఓవర్నైట్ స్కోరు 274/4కు ఇంగ్లాండ్ మరో 117 పరుగులు జోడించి 391/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 72.4 ఓవర్లకు గాను 253 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో నాల్గవ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 78 పరుగులతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్స్లో పేసర్ బెన్ స్టోక్స్ 6 వికెట్లు తీసుకోగా, వుడ్ 3, బ్రాడ్ 1 వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 60 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.