హైదరాబాద్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహమ్మద్ హఫీజ్ బౌలింగ్ శైలిపై అనుమానం వ్యక్తం చేస్తూ అంఫైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. అబుదాబి వేదికగా శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్.. ఐసీసీ నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు.
దీంతో అతడి బౌలింగ్పై తాత్కాలికంగా నిషేధం విధించిన ఐసీసీ, 14 రోజుల్లోపు పరీక్షలకు హాజరై బౌలింగ్ శైలిని నిరూపించుకోవాలని ఆదేశించింది. అయితే హఫీజ్ బౌలింగ్ శైలిపై ఐసీసీకి ఫిర్యాదు అందడం ఇది మూడోసారి. 2014, డిసెంబర్లో అనుమానాస్పద బౌలింగ్తో దాదాపు ఐదు నెలల పాటు ఐసీసీ నిషేధం విధించింది.
ఆ తర్వాత 2015, జులైలో మరోసారి ఇలాంటి ఫిర్యాదు అందడంతో 12 నెలల పాటు అతడిపై ఐసీసీ నిషేధం విధించింది. 17 నవంబర్, 2016న బ్రిస్బేన్లోని నేషనల్ క్రికెట్ సెంటర్లో హఫీజ్ బౌలింగ్ పరీక్షలను ఎదుర్కొన్నాడు. అందులో విజయవంతం కావడంతో అతడిని బౌలింగ్కు ఐసీసీ అనుమతించింది.
తాజాగా మరోసారి అతడిపై ఫిర్యాదు రావడంతో మరోసారి బ్రిస్బేన్లోని నేషనల్ క్రికెట్ సెంటర్లో పరీక్షలను హఫీజ్ హాజరు కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హఫీజ్ 39 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్లో లంకపై పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ తరుపున హఫీజ్ ఇప్పటివరకు 193 వన్డేల్లో 136 వికెట్లు తీసుకోగా, టెస్టుల్లో 52, టీ20ల్లో 46 వికెట్లు తీశాడు.