390 మిలియన్ డాలర్లు ఇస్తామంటున్న ఐసీసీ
కొత్త విధానాన్ని రూపొందించిన వర్కింగ్ గ్రూప్ కూడా ఓటింగ్కు ముందు బీసీసీఐ ప్రతినిధి అమితాబ్ చౌదరితో సమావేశమై మొత్తం 390 మిలియన్ డాలర్లు ఇస్తామని అధికారికంగా ప్రతిపాదించింది. 'వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనను తిరస్కరించిన అమితాబ్ చౌదురి 450 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైతే.. స్వదేశం వెళ్లి బోర్డు సభ్యులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అందుకు మనోహర్ ససేమిరా అన్నాడు' అని బీసీసీఐ సీనియర్ అఫీసియల్ ఒకరు చెప్పారు.
ఐసీసీ ఆఫర్ తిరస్కరించిన బీసీసీఐ
అయితే ఆ ఆఫర్ను ఇంకా పూర్తిగా వెనక్కి తీసుకోలేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ సమావేశంలో బుధవారం ఆమోదముద్ర వేసిన దాని ప్రకారం భారత్కు ఎనిమిదేళ్ల కాలానికి (2015-2023) మొత్తం 293 మిలియన్ డాలర్లు పొందనుంది. తమ సమావేశానికి ముందుగా ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధమైనా, బీసీసీఐ దానిని నిర్మొహమాటంగా తిరస్కరించింది.
బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం
దీనిపై త్వరలో బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. 30 మంది సభ్యుల్లో ఎక్కువ శాతం ఛాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 390 మిలియన్లు ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధపడుతున్న నేపథ్యంలో మధ్య మార్గంగా ఐసీసీని 450 మిలియన్లు ఇచ్చేందుకు ఒప్పించాలని బీసీసీఐ సీనియర్లు మంతనాలు జరుపుతున్నారు.
450 మిలియన్ డాలర్లు డిమాండ్
‘ఐసీసీ తాజా ప్రతిపాదనను బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో చర్చిస్తాం. మేం 390 మిలియన్ డాలర్ల మొత్తానికి గనుక అంగీకరిస్తే మేలో జరిగే సమావేశంలో దానికి అధికారిక ముద్ర కల్పిస్తామని ఐసీసీ చెప్పింది' అని భారత బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా ఇప్పటివరకు జట్టును ప్రకటించలేదు. ఒకవేళ ఛాంపియన్స్ టోర్నీ నుంచి భారత్ వైదొలగాలని నిర్ణయించుకుంటే గనుక ఐసీసీపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ దిగివచ్చి బీసీసీఐ డిమాండ్ చేస్తున్న మొత్తం ఇచ్చేందుకు సిద్ధమవుతుందా? లేక బీసీసీఐనే తగ్గుతుందా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
కొత్త ఆర్థిక విధానం ప్రకారం బీసీసీఐకి 293 మిలియన్ డాలర్లు
కొత్త ఆర్థిక విధానం ప్రకారం బీసీసీఐ 293 మిలియన్ డాలర్లు పొందనుండగా... ఇక రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఇంగ్లాండ్ (143), ఆస్ట్రేలియా (132) మిలియన్ డాలర్లు ఆర్జించనున్నాయి. జింబాబ్వేకు అత్యల్పంగా 94 మిలియన్ డాలర్లు దక్కనుండగా.. మిగతా బోర్డులకు 132 మిలియన్ డాలర్ల చొప్పున లభించనున్నాయి. అయినా సరే బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. తమకు కనీసం 450 మిలియన్ డాలర్లు కావాలని కోరుతోంది.