హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర్ సింగ్ ధోని నాగ్పూర్ వేదికగా ఆదివారం (జనవరి 1) నుంచి జరగనున్న జార్ఖండ్-గుజరాత్ రంజీ సెమీఫైనల్ మ్యాచ్కు హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం ధోని ఈ సీజన్ రంజీలో పాల్గొనకపోయినా తన సొంత రాష్ట్రమైన జార్ఖండ్ ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
రంజీ క్రికెట్లో తొలిసారి సెమీ ఫైనల్కు చేరిన జార్ఖండ్ జట్టుకు ధోని మద్దతుగా నిలవాలనుకుంటున్నాడు. ఆదివారం నాడు జార్ఖండ్ జట్టు గుజరాత్తో నాగ్పూర్ వేదికగా మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టులోని కుర్రాళ్లతో కలిసి ధోనీ నెట్స్లో ప్రాక్టీస్ చేశాడు. అవసరమైతే ఈ రంజీ మ్యాచ్లో ధోని ఆడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
'ధోని నాగ్పూర్లోనే ఉన్నాడు. నాగ్పూర్ మ్యాచ్కు ధోనీ వచ్చే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సమయంలో అతనిస్తున్న సలహాలు కుర్రాళ్లకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి' అని జట్టు మేనేజ్మెంట్ సభ్యుడొకరు తెలిపారు. అయితే జార్ఖండ్ మ్యాచ్ ముగిసే వరకు ధోని నాగ్ పూర్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
జనవరి మొదటి వారంలో ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్లకు భారత జట్టుని ఎంపిక చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కెప్టెన్గా ధోని భాగస్వామ్యం ఈ ఎంపికలో ఉండనుండటంతో అతను నాగ్పూర్లో ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాగా, రంజీ ట్రోఫీ ఆరంభానికి ముందు రాంచీలో జరిగిన ప్రీ సీజన్ క్యాంప్లో ధోనీ పాల్గొన్నాడు.
అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టులో చెన్నైలో బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ సమయంలోనూ జార్ఖండ్ జట్టు కోసం ధోనీ సమయం వెచ్చించిన సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరిస్కు ముందు ఇండియా ఏ జట్టుతో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్లో ధోని పాల్గొంటాడని తెలుస్తోంది.