ధోని గొప్ప ఆటగాడే, కానీ!..
ఎంఎస్ ధోని గొప్ప ఆటగాడు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు సంజీవ్. అతని మైండ్ సెట్, గెలవాలని అతను తపించే తీరు అమోఘం అన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధోని అని గుర్తు చేశారు. అదే సమయంలో పుణె కెప్టెన్ స్మిత్.. మైదానంలో ధోని కన్నా పరిణతితో వ్యవహరిస్తారని అర్థం వచ్చేలా సంజీవ్ వ్యాఖ్యలు చేశారు.
స్మిత్ యాటిట్యూడ్ ఇలాంటిది:
గెలుపు తప్ప మరేది వద్దనుకునే యాటిట్యూడ్ స్మిత్కు ఉందన్నారు సంజీవ్ గొయాంకా. ధోని కన్నా అతని మైండ్ సెట్ అద్భుతమన్నారు. "12 బంతుల్లో.. 30 పరుగులు కొట్టు.. లేదా అవుటై వచ్చేసెయ్" లాంటి సూచనలు చేస్తాడని తెలిపారు. కష్ట సమయాల్లో స్మిత్ ఎన్నోసార్లు ఆదుకున్నాడన్నారు.
స్మిత్ సరిగా ఆడనందువల్లే:
ఫుడ్ పాయిజన్ వల్ల స్మిత్ సరిగా ఆడని కారణంగానే ఈ సీజన్ ప్రారంభం మ్యాచ్లలో పుణే పలు ఓటములు చవిచూసిందని సంజీవ్ గొయాంకా అన్నారు. మొత్తం మీద స్మిత్ ఒక్కడి వల్లే పుణే జట్టు ఐపీఎల్ లో రాణించిందని సంజీవ్ పరోక్షంగా తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. దీన్నిబట్టి చూస్తే.. ధోనిని వారు ఎంత చిన్న చూపు చూస్తున్నారో అర్థమవుతోంది.
రేపటితో ముగియనున్న పుణే ప్రస్థానం:
2016లో ఐపీఎల్లోకి ప్రవేశించిన పుణే జట్టు ప్రస్థానం ఆదివారంతో ముగియనుండటం గమనార్హం. ఆదివారం నాడు ముంబైతో పుణె జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది. దీనిపై గొయాంకా స్పందిస్తూ.. సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్ల ఎంపికల లోపాల వల్లే గతేడాది పుణే మెరుగ్గా రాణించలేదని అన్నారు.
ఈ సీజన్ లో స్మిత్ చెప్పినట్లే.. ఇమ్రాన్ తాహిర్, బెన్ స్టోక్స్ లు రాణించారని వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి లాంటి లోకల్ ప్లేయర్స్ కూడా రాణించడం జట్టుకు కలిసొచ్చిందన్నారు.