హైదరాబాద్: బీసీసీఐ భారత జట్టుకి అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ కూడా. అలాంటి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రశంసలు కురిపించాడు.
ఇండిపెండెన్స్ కప్లో భాగంగా దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసెస్ నేతృత్వంలోని వరల్డ్ ఎలెవన్ జట్టు ప్రస్తుతం పాకిస్థాన్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. వరల్డ్ ఎలెవన్తో తలపడుతున్న పాకిస్థాన్ జట్టులో సభ్యుడిగా ఉన్న మాలిక్ గురువారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించాడు.
ఈ సందర్భంగా ఓ అభిమానిధోనీ గురించి మీరేం చెబుతారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు 'లెజెండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అని ట్వీట్ చేశాడు. షోయబ్ మాలిక్ చెప్పిన సమాధానాన్ని చూసిన ధోని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
Legend GOAT
— Shoaib Malik (@realshoaibmalik) September 14, 2017
ఇండిపెండెన్స్ కప్లో భాగంగా వరల్డ్ ఎలెవన్తో జరిగిన తొలి టీ20లో 38 పరుగులు చేసిన మాలిక్, రెండో టీ20లో 39 పరుగులు చేశాడు. 88 మ్యాచ్ల్లో 1702 పరుగులు చేసిన షోయబ్ మాలిక్.. పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెండన్ మెక్కల్లమ్ (న్యుజిలాండ్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), విరాట్ కోహ్లీ(భారత్), మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్), మహ్మద్ షెహజాద్(పాకిస్థాన్)లు మాలిక్ కంటే ముందు ఉన్నారు. కాగా, 2009లో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్లో క్రికెట్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు.
లాహార్లోని గడాఫీ స్టేడియంలో సెప్టెంబర్ 12, 13, 15 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్లను నిర్వహించారు. ఈ మూడు టీ20ల సిరిస్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మ్యాచ్ల భద్రతకు సుమారు తొమ్మిది వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగించారు.
ఎందుకంత ప్రత్యేకం: పాక్కు వరల్డ్ ఎలెవన్ జట్టు, కనివినీ ఎరుగని భద్రత
ఈ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి డుప్లెసిస్తో పాటు ఆమ్లా, మోర్కెల్, మిల్లర్, తాహిర్, ఆస్ట్రేలియా నుంచి బెయిలీ, బెన్ కట్టింగ్, టిమ్ పేన్, విండీస్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఆడుతున్నారు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక నుంచి ఒక్కో ఆటగాడు పాల్గొన్నారు. తొలి మ్యాచ్లో పాక్ విజయం సాధించగా, రెండో టీ20లో వరల్డ్ఎలెవన్ విజయం సాధించింది. ఈ సిరిస్లో చివరిదైన మూడో టీ20 శుక్రవారం జరగనుంది.