హైదరాబాద్: ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనియేనని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఓ జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ టెస్టు క్రికెట్ నుంచి మూడేళ్ల క్రితమే రిటైర్మెంట్ తీసుకోవడం ధోని తెలివైన నిర్ణయమని కొనియాడాడు.
ఇంగ్లాండ్ వేదికగా జరిగే 2019 వరల్డ్ కప్ జట్టు కోసం సెలక్టర్లు ఆటగాళ్ల ఫామ్ని సీరియస్గా పరిశీలిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి మధ్య శ్రీలంక పర్యటనని ఆరంభించిన ధోని వరుసగా హాఫ్ సెంచరీలు సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
దీంతో సెప్టెంబర్ 17 (ఆదివారం) నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ఐదు వన్డేల సిరీస్లో ధోనిపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. 'టెస్టు ఫార్మాట్ నుంచి విశ్రాంతి దొరకడంతో ధోనిలో ఉత్సాహం పెరిగింది. అతను ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్. వికెట్ల వెనక అతని వేగం అమోఘం. భారత క్రికెట్కి ధోని ఒక ఆస్తి' అని రవిశాస్త్రి అన్నాడు.
'డ్రెస్సింగ్ రూములో అత్యంత అనుభవశాలి. జట్టుపై అతని ప్రభావం చాలా ఉంది. వయసు పెరుగుతోంది.. అతని ఆట అయిపోయింది అనేది ఓ కల్పన మాత్రమే. ఒకవేళ ఎవరైనా అలా ఆలోచిస్తే వారు పొరబడినట్లే' అని ఈ సందర్భంగా రవిశాస్త్రి వెల్లడించాడు.
శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్ కీపర్గా ధోని సరికొత్త రికార్డుని సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం ఇప్పటికే స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు భారత్కు చేరుకుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగే తొలి వన్డేతో ఈ సిరిస్ ఆరంభం అవుతుంది.