హైదరాబాద్: భారత జట్టుకు సేవలందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడని శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ అన్నాడు. తన క్రికెట్ కెరీర్లో తాను చూసిన అత్యుత్తమ భారత క్రికెటర్లలో ధోని ఒకడని మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు.
'నా క్రికెట్ కెరీర్లో నేను చూసిన అత్యుత్తమ భారత కెప్టెన్లలో ధోని ఒకడు. అతని నాయకత్వంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మూడు సంవత్సరాలు ఆడాను. నేను ఐపీఎల్ ఆడిన ఏ సందర్భంలో కూడా ధోనిలో గర్వం కనబడలేదు. ఎప్పుడూ సీనియర్ ఆటగాళ్లకు గౌరవించే వ్యక్తిత్వం ధోనిదే' అని అన్నాడు.
'చెన్నై జట్టులో ఆడిన మైక్ హస్సీతో పాటు నా నుంచి కూడా అనేక సలహాలను ధోని తీసుకునేవాడు. కింది నుంచి పైకి వచ్చిన ధోని ఆ స్థాయిని మరచిపోకుండా ఎప్పుడూ హుందాగా ఉండేవాడు' అని ముత్తయ్య మురళీ ధరన్ అన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో ఆ బాధ్యతలను సెలక్టర్లు కోహ్లీకి అప్పగించిన సంగతి తెలిసిందే.
మూడు ఫార్మెట్లలో జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించిన కోహ్లిపై ముత్తయ్య విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత్ క్రికెట్ జట్టులో ధోని తరువాత అదే స్థాయిలో సమర్ధవంతమైన నాయకత్వ లక్షణాల్లో కల్గిన వ్యక్తి కోహ్లియే అంటూ మురళీ ధరన్ అభిప్రాయపడ్డాడు.
'కెప్టెన్సీ బాధ్యతను కోహ్లి సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం నాకుంది. ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ను కోహ్లి తేలిగ్గా తీసుకోకూడదు. ధోని సలహాలను తీసుకుంటూ అతను కెప్టెన్సీ జర్నీని కొనసాగిస్తే మంచింది' అని అన్నాడు.
టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరిస్ను ఆడనుంది. జనవరి 15న పూణెలో ఇంగ్లాండ్-భారత జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం విజన్ 2020 ప్రోగ్రామ్కు స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్గా మురళీ ధరన్ వ్యవహరిస్తున్నాడు.