హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని సరైన సమయంలో తప్పుకున్నాడని మాజీ దిగ్గజ క్రికెటర్, అండర్ 19 కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. ధోని నిర్ణయంతో 2019 వరల్డ్ కప్ నాటికి జట్టును పటిష్ట పరుచుకునేందుకు కోహ్లికి తగినంత సమయం దొరుకుతుందని చెప్పాడు.
'ధోని నిర్ణయంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు కాకపోతే ఆ తర్వాత వీడ్కోలు పలికేవాడు. నిజానికి ధోనికి వాస్తవ పరిస్థితేమిటో తెలుసు. చాంపియన్ ట్రోఫీ వరకు అతడి ముందుకు కేవలం ఒక వన్డే సిరీస్ మాత్రమే ఉంది. అయితే వచ్చే వరల్డ్ కప్ వరకు కొనసాగలేకపోతే ముందుగానే కెప్టెన్సీ పగ్గాలను కోహ్లికి అప్పగించడం ఉత్తమం అని భావించినట్టు ఉన్నాడు. ఇది ఏమంత పెద్ద విషయం కాదు. కొన్నాళ్లు తను మరొకరి కింద ఆడాలని అనుకుంటున్నాడు' అని ESPN క్రిక్ ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో ద్రవిడ్ పేర్కొన్నాడు.
నిజం చెప్పాలంటే ధోని లాంటి అనుభవం కలిగిన అటగాడు ఉండటం ఏ జట్టుకైనా వరమే అని ద్రవిడ్ తెలిపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ విషయంలో చాలా అదృష్టవంతుడేనని చెప్పాలి. మ్యాచ్లో ధోని సలహాలతో పాటు ఆటపై అతడికున్న అపార పరిజ్ఞానం వెలకట్టలేని విధంగా కోహ్లికి ఉపయోగపడుతుందని చెప్పారు.
ముఖ్యంగా పెద్ద టోర్నీలు రానున్న ఇలాంటి సమయంలో ధోనీలాంటి ఆటగాడు టీమ్కు ఎంతో అవసరం అని అన్నాడు. అయితే కేవలం వికెట్ కీపింగ్, బ్యాటింగ్తోనే తన స్థానాన్ని ధోనీ నిలుపుకుంటాడా లేదా అన్నది పూర్తిగా అతనిపైనే ఆధారపడి ఉంటుందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
'ధోని ఫామ్లో ఉండి జట్టులో చోటు దక్కించుకుంటే అతడి అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఒత్తిడిలో ఉన్న సమయంలో అతడి సామర్థ్యం భారత్కు మేలు చేకూరుస్తుంది. ఇలాంటి ఆటగాడు దొరకడం అంత సులువు కాదు. అయితే తను కూడా ఫామ్లో ఉండాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే జట్టులో చోటు ఉంటుంది. ఇదే జరిగితే రానున్న భారీ టోర్నమెంట్లలో వన్డే జట్టుకు అత్యంత విలువైన ఆటగాడు ఉన్నట్టే. కోహ్లి కూడా ధోనిలాంటి ఆటగాడు ఫామ్లో ఉంటూ జట్టులో ఉండాలనే కోరుకుంటాడు' అని అన్నాడు.
భారత్ నుంచి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ధోని చరిత్రను గుర్తు పెట్టుకుంటుందని అన్నాడు. ఇక భారత జట్టుకు కెప్టెన్గా ఉండడం అంటే మామూలు విషయం కాదని, ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయమని అన్నారు. ధోని మాత్రం ఈ విషయంలో సమర్థంగా పనిచేశాడని, ప్రశాంతచిత్తంతో ముందుకెళ్లాడని ప్రశంసించారు.