హైదరాబాద్: కెప్టెన్సీకి దూరమైనా మహేంద్ర సింగ్ ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోని ఆటోగ్రాఫ్ కోసం ఓ అభిమానికి ఏకంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ధోని బ్యాటింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్, విదర్భ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్ కాంప్లెక్స్ మైదానంలో జరిగింది. ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని బౌండరీ అవతలున్న ఫెన్సింగ్ను దాటుకుని పిచ్ మధ్యలోకి వచ్చేశాడు.
అభిమాని రావడాన్ని చూసిన ధోని పరిస్థితిని అర్ధం చేసుకుని అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించాడు. ఈ సమయంలో అతడు ధోనికి పాదాభివనందనం కూడా చేశాడు. అయితే ధోని ఆ అభిమానిపై ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకపోవడం విశేషం.
దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు. రెండు నెలల కిందట ముంబైలో ఇంగ్లాండ్తో ప్రాక్టీస్ వన్డే సందర్భంగా కూడా ఓ అభిమాని పిచ్ మధ్యలోకి వచ్చి ధోని పాదాల్ని తాకిన సంగతి తెలిసిందే. మరోవైపు ధోని బ్యాటింగ్ చూడడం కోసం వచ్చిన ఫ్యాన్స్ 'ధోనీ ధోనీ' అంటూ నినాదాలు చేశారు.
ధోని సారథ్యంలోని జార్ఖండ్ జట్టు ఆరు వికెట్లతో విదర్భను ఓడించింది. ధోని ఈ మ్యాచ్ని సిక్సుతో ముగించడం విశేషం. జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం జార్ఖండ్ జట్టు 45.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.