న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బీసీసీఐకి ఊరట లభించింది. క్రికెట్లో సమూల మార్పుల కోసం ఏర్పాటైన జస్టిస్ లోథా కమిటీ ప్రతిపాదనల తీర్పు విచారణ ఈనెల 17వ తేదీ వరకు వాయిదా పడింది. గురువారం విధించిన 24 గంటల డెడ్ లైన్ ముగియడంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది.
అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల తీర్పును సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఇందులో బీసీసీఐకి సుప్రీం కోర్టు సెలవులు కూడా కలిసొచ్చాయి. లోథా కమిటీ ప్రతిపాదనల అమల్లో జాప్యంపై దాఖలైన పిటిషన్పై తుది తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం వెలువరించే అవకాశం ఉందని భావించారు.
లోథా కమిటీ ప్రతిపాదనలను అమలు చేస్తామని తీర్మానం చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ ఇచ్చిన నిధులను వినియోగించుకునేందుకు అన్ని రాష్ట్రాల శాఖల పాలక మండలిలో ఆ తీర్మానాన్ని ఆమోదింప జేయాలని సుప్రీం ఆదేశించింది. దీనికి సంబంధించిన అఫిడవిట్లను లోథా కమిటితో పాటు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
దీంతో పాటు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటీవల కాలంలో ఐపీఎల్పై వినిపిస్తున్న వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయంటూ అనురాగ్ ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఇకపై ఐపీఎల్ నిర్వహణను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు నిర్ణయించాలంటూ అందులో పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బీసీసీఐకి ఊరట కలిగించే విధంగా ఉన్నా, ఇప్పటికే మొదలైన రంజీ ట్రోఫీ నిర్వహణపై ఎటువంటి సృష్టత రాలేదు. దీంతో ఈ టోర్నమెంట్ ను ఎలా నిర్వహించాలి అనే దానిపై ఎటువంటి ప్రణాళిక లేదని అసోసియేషన్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.