హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ల పట్ల హెడ్మాస్టర్లా ఉండేవాడనే అందుకే కుంబ్లే కోచ్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందని రాజీనామా చేసిన సందర్భంలో ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన కోచింగ్ శైలి నచ్చడం లేదంటూ అనిల్ కుంబ్లే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో జట్టు ప్రాక్టీస్ సమయంలో క్రికెటర్లకి సూచనలిచ్చేందుకు కుంబ్లే వస్తే.. కోహ్లీ దురుసుగా ప్రవర్తించి అవమానించాడనే వార్తలు కూడా వెలుగుచూశాయి.
దీంతో పాటు ప్రాక్టీస్ విషయంలో కుంబ్లే మరింత కఠినంగా ఉంటున్నాడని.. ఆటగాళ్లకి స్వేచ్ఛ ఇవ్వడం లేదంటూ జట్టులోని ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాజాగా అనిల్ కుంబ్లే హెడ్మాస్టర్లాగా వ్యవహరించేవాడని వచ్చిన వార్తలపై వృద్ధిమాన్ సాహా స్పందించాడు.
'డ్రెస్సింగ్ రూములో అనిల్ కుంబ్లే ఏమీ కఠినంగా ఉన్నట్లు నాకు కనిపించలేదు. నేను అందరితో కలివిడిగానే ఉండేవాడిని. మేమంతా కలిసి సరదాగా జోకులేసుకునేవాళ్లం. టెస్టు మ్యాచ్లు ఆడే సమయంలో ఇబ్బందికర వాతావరణం అయితే నేను చూడలేదు. ఇక వన్డే, టీ20 మ్యాచ్ల సమయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కొత్త కోచ్ రవిశాస్త్రితో కూడా మేము సౌకర్యంగానే ఉండగలం' అని సాహా వివరించాడు.
లంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో వృద్ధిమాన్ సాహా కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడనుంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జులై 26న ప్రారంభం కానుంది.