న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో ప్రజల అంచనాలను అందుకోలేక పోయినందుకు పాకిస్థాన్ జట్టు కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షాహిద్ అఫ్రిది కూడా అదే బాటలో నడిచాడు. తనను మన్నించాలంటూ పాకిస్థాన్ ప్రజలను వీడియో ద్వారా వేడుకున్నాడు.
క్రికెట్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని వాపోతూ తన ట్విట్టర్ పేజీలో వీడియోను పోస్ట్ చేశాడు. 'నా గురించి ఇతరులు ఏమనుకున్నా లెక్క చేయను. కానీ మీకు (పాకిస్థాన్ ప్రజలకు) జవాబుదారీగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు నన్ను క్షమించమని కోరుతున్నా. టీ20లో పాకిస్థాన్ జట్టు, నేను అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం' అని పేర్కొన్నాడు.
ఎప్పుడూ దేశం కోసమే ఆడానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడలేదని షాహిద్ అఫ్రిదీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. 20 ఏళ్ల నుంచి స్టార్ హోదా మోస్తున్నానని తెలిపాడు. తాను మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు దేశం మొత్తం తన వెంట ఉందని అనుకున్నానని అన్నాడు.
జట్టు అంటే కేవలం 11 మంది సభ్యులు మాత్రమే కాదని చెప్పుకొచ్చిన అప్రిదీ, జట్టు అంటే దేశం మొత్తంగా అభివర్ణించాడు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న షాహిద్ అప్రిదీ స్వదేశానికి తిరిగి రాగానే కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భావిస్తోంది.
36 ఏళ్ల షాహిద్ అప్రిదీ ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో కాశ్మీరులు పాకిస్థాన్ వైపు ఉన్నారంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ తరుపున 27 టెస్టు మ్యాచ్లు ఆడిన అఫ్రిదీ 48 వికెట్లు తీసుకుని, 1716 పరుగులు చేశాడు. ఇక వన్డేల విషయానికి వస్తే 398 వన్డే మ్యాచ్లు ఆడిన అఫ్రిదీ 8064 పరుగులు సాధించి, 395 వికెట్లను తీసుకున్నాడు. 98 టీ20 మ్యాచ్లు ఆడి 1405 పరుగులు సాధించి 97 వికెట్లు తీసుకున్నాడు.
I have always been playing cricket for the nation and not for my self.pakistan zindabad👍🏻
— Shahid Afridi (@SAfridiOfficial) 29 March 2016
https://t.co/2BnFEt3kkF