హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. 2010లో ఇంగ్లాండ్ సిరీస్తో పాటు పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్లో కూడా పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన పలువురు ఆటగాళ్లపై ఆ దేశ బోర్డు ఇప్పటికే నిషేధం విధించింది.
తాజాగా, పాక్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఒక బుకీ సంప్రదించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్.. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ను పాకిస్థాన్ ఇప్పటికే 4-0తో సొంతం చేసుకుంది.
అయితే మూడో వన్డేకు ముందు ఓ బుకీ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను కలిసి శ్రీలంకను గెలిపించాలని కోరాడట. సర్పరాజ్ను బుకీ కలిసిన విషయాన్ని పీసీబీ వర్గాలు సైతం ధృవీకరించాయి. అయితే సదరు బుకీ చేసిన ఆఫర్ను సర్ఫరాజ్ తిరస్కరించడంతో పాటు కాకుండా అక్కడ ఉన్న అవినీతి నిరోధక అధికారులు వెంటనే సమాచారం అందించినట్లు పీసీబీ సీనియర్ అధికారి తెలిపారు.
'సర్ఫరాజ్ను బుకీ సంప్రదించాడు. ఈ విషయాన్ని వెంటనే జట్టు మేనేజ్మెంట్కు చెప్పడంతో అవినీతి నిరోధక అధికారులు అప్రమత్తమయ్యారు. వన్డే సిరిస్ను ఫిక్సింగ్ బారిన పడకుండా చేయాలంటే సర్ఫరాజ్ను ఉదాహరణగా తీసుకుని పాక్ క్రికెటర్లు ముందుకు సాగాలి. ఒక ఆటగాడిగా, కెప్టెన్గా సర్ఫరాజ్ గౌరవప్రదంగా వ్యవహరించాడు' అని పీసీబీ అధికారి పేర్కొన్నారు.
బోర్డు నిబంధనల ప్రకారం ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సంఘటన అనంతరం వెంటనే అప్రమత్తమైన పీసీబీ అధికారులు జట్టులోని మిగతా ఆటగాళ్లపై నిఘా పెట్టారు. విరామం సమయంలో బయటకు వెళ్తే ఎక్కువ సమయం ఉండకూడదని, స్నేహితులను కలవకూడదనే ఆంక్షలు విధించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో దుబాయిలో పాకిస్థాన్ జాతీయ జట్టు బస చేసే హోటల్ను సైతం బోర్డు అధికారులు మార్చడం విశేషం. ఇక పీఎస్ఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న షర్జిల్ ఖాన్, ఖలిద్ లలిఫ్పై పీసీబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.