క్రైస్ట్ చర్చి: ఆదివారం న్యూజిలాండ్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు వణికిపోయారు. అయితే ఈ ప్రమాదం నుంచి తామంతా సురక్షితంగా బయటపడ్డామని జట్టు మేనేజర్ వాసిం బారీ భూకంప అనుభూతిని పంచుకున్నాడు.
వివరాల్లోకి వెళితే రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెటర్లు న్యూజిలాండ్కు వచ్చారు. అయితే న్యూజిలాండ్లోని దక్షిణ దీవిని భారీ భూకంపం కుదిపేసింది. ఈ భారీ భూకంపం పాక్ క్రికెటర్లను తీవ్రమైన షాక్ గురి చేసింది.
క్రైస్ట్ చర్చికి 50 కిలోమీటర్ల దూరం భూకంప కేంద్రం నమోదైంది. ఇదే సమయంలో నీల్సన్లోని హోటల్లో పాక్ క్రికెటర్లు బస చేయడంతో స్థానికంగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటు సునామీ వచ్చే అవకాశం కూడా ఉందనే హెచ్చరికలు పాకిస్థాన్ క్రికెటర్లను కలవరపెట్టాయి.
సునామీ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే హోటల్ సిబ్బంది హుటాహుటీనా పాక్ క్రికెటర్లను అక్కడ నుంచి వేరే చోటకి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్లో ఉన్న పాక్ జట్టు మేనేజర్ బారీ మీడియాకు వెల్లడించారు.
'టూర్లో భాగంగా నీల్సన్లోని ఓ హోటల్ ఉన్నాం. ఆ సమయంలో భూకంపం వార్త మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. అయితే ఆ హోటల్ సిబ్బంది మా జట్టుకు అత్యంత రక్షణగా నిలిచారు. భూకంపం వార్త తెలిసే సమయానికి మేము ఏడో అంతస్తులో ఉన్నాం. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది మమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చింది. సునామీ ప్రమాదం లేదనే వార్త తెలిసే వరకూ మమ్మల్ని సురక్షిత జోన్ లో ఉంచారు' అని బారీ తన అనుభవాన్ని పంచుకున్నాడు.
న్యూజిలాండ్ను కుదిపేసిన భూకంపం: సునామీ హెచ్చరిక
కాగా, క్రిస్ట్ చర్చ్ నగరాన్ని ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో ఆదివారం భూకంపం వచ్చింది. ఆ తీవ్రత రిక్టార్ స్కేలుపై 7.4 గా నమోదైంది. దాంతో సునామీ వచ్చే అవకాశం ఉందని న్యూజిలాండ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆదివారం సంభవించిన భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని యుఎస్ ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.
న్యూజిలాండ్కు దక్షిణంగా ఉన్న ద్వీపం క్రైస్ట్చర్చ్. అంతేకాదు న్యూజిలాండ్ దేశంలోనే అతి పెద్ద పట్టణాల్లో ఒకటిగా పేరుగాంచింది. 2011 ఫిబ్రవరిలో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, 185మంది మృత్యువాతపడ్డారు. తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది.