భారత్కు బంగ్లా సరితూగదు
ఆటగాళ్ల వ్యక్తిగత బలాల పరంగా చూస్తే బంగ్లాదేశ్ ఏ అంశంలోనూ భారత్కు బంగ్లా సరితూగదు. బ్యాట్స్మెన్ భీకర ఫామ్, బౌలర్లు జోరు, ఫీల్డర్ల హుషారుతో కోహ్లీసేన అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్ అదే ధాటిని కొనసాగిస్తే సెమీస్ దాటడం నల్లేరుమీద నడకే. ఓపెనర్ శిఖర్ ధవన్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. రోహిత్, కోహ్లీ, యువీ, ధోనీ జోరుమీదున్నారు.
కెరీర్లో 300 వన్డే ఆడుతున్న యువీ
శ్రీలంకపై పేలవ ప్రదర్శన అనంతరం కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ సఫారీలపై అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా కెరీర్లో 300 వన్డే ఆడుతున్న యువీ చెలరేగి ఆడి ఈ మ్యాచ్ను చిరకాలం గుర్తిండిపోయేలా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. టాప్4 బ్యాట్స్మెన్ సూపర్ ఫామ్లో ఉండడంతో లోయర్ ఆర్డర్ను పరీక్షించే అవకాశం రాలేదు. టాపార్డర్ విషయంపై జట్టులో ఎలాంటి ఆందోళన లేదని కోహ్లీ స్పష్టం చేశాడు.
ధోనీ ఓ అద్భుత బ్యాట్స్మెన్
50 ఓవర్ల ఫార్మాట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ అద్భుత బ్యాట్స్మెన్. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. సూపర్ ఫినిషింగ్ ఇవ్వడంలో తనకు తానే సాటి. ఇతనితో ముష్ఫికర్కు ముడిపెట్టాలని చూస్తే బంగ్లా చేతులు కాల్చుకోక తప్పదు. ఇప్పటికీ ముష్ఫికర్ బ్యాటింగ్లో నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు
ఈ మ్యాచ్లో భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. అశ్విన్ రాకతో బౌలింగ్ సమస్య తీరిపోయింది. ఉమేశ్ యాదవ్ స్థానంలో గత మ్యాచ్లో ఆడిన స్పిన్నర్ అశ్విన్ను కొనసాగించే అవకాశముంది. ఈ మేరకు కెప్టెన్ కోహ్లీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్ అంతా ఇప్పడు క్రికెట్ జపంతో ఊగిపోతోంది.
బంగ్లాదేశ్కు తొలిసారి ఫైనల్ చేరే అవకాశం
ఓ ఐసీసీ టోర్నీలో బంగ్లాదేశ్కు తొలిసారి ఫైనల్ చేరే అవకాశమున్న నేపథ్యంలో అక్కడి అభిమానులు ఎంతో ఆశతో తమ జట్టు విజయం కోసం ఎదురు చూస్తున్నారు. స్వదేశంలో 2015లో జరిగిన వన్డే సిరిస్లో భారత్ను 2-1తో ఓడించిన బంగ్లా తాము ఏదైనా సాధించగలమని నిరూపించింది. 2015 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో, గతేడాది టీ-20 వరల్డ్కప్లో భారత్ చేతిలో ఓటమికి గట్టి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.
గత రెండు మ్యాచ్ ల్లో తేలిపోయిన ముష్ఫికర్ రషీమ్
అయితే, మరో ఓపెనర్ సౌమ్య సర్కార్తో పాటు షబ్బీర్ రహ్మాన్ నిరాశ పరుస్తున్నారు. ముష్ఫికర్ రషీమ్ గత రెండు మ్యాచ్ల్లో తేలిపోయాడు. ఎప్పుడూ బలంగా కనిపించే బంగ్లా బౌలింగ్ విభాగం ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. కెప్టెన్ మష్రఫే మోర్తజా, భారీ అంచనాలున్న ముస్తాఫిజుర్, రూబెల్ విఫలమయ్యారు. స్పిన్నర్ మొసాదెక్ ఒక్కడే రాణిస్తుండగా.. కివీస్పై తస్కిన్ అహ్మద్ ఫర్వలేదనిపించాడు.
పిచ్, వాతావరణం
బర్మింగ్హామ్లో పాక్తో ఆరంభ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఇది స్పోర్టింగ్ వికెట్. బ్యాటింగ్తో పాటు బౌలింగ్కూ సహకరిస్తుంది. ఇక్కడి పిచ్పై ఇటీవలి కాలంలో మ్యాచ్లు జరగలేదు. ముందు బ్యాటింగ్కో లేదా బౌలింగ్ చేయాడానికో జట్లు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్టకేలకు బర్మింగ్హామ్లో వాతావరణం చక్కబడింది. వర్షం మ్యాచ్కు అంతరాయాలు కలిగించే అవకాశం లేకపోవడం శుభవార్తే.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్, ధవన్, కోహ్లీ (కెప్టెన్), యువరాజ్, ధోనీ (కీపర్), కేదార్, హార్దిక్, జడేజా, అశ్విన్, ఉమే్ష, భువనేశ్వర్, బుమ్రా.
బంగ్లాదేశ్: తమీమ్, సౌమ్య సర్కార్, షబ్బీర్ రహ్మాన్, ముష్ఫికర్ (కీపర్), షకీబల్, మహ్మదుల్లా, మొసాదెక్, తస్కిన్, మోర్తజా (కెప్టెన్), రూబెల్, ముస్తాఫిజుర్.