మొహాలీ: ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా మార్చి 27న శనివారం ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తలపడనుంది. టీ20 మ్యాచుల్లో ఆస్ట్రేలియాపై మంచి రికార్డే ఉన్నప్పటికీ గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. టీ20 టోర్నీలో ఫేవరైట్ గా అడుగుపెట్టిన టీమిండియా ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో గెలుపొందింది.
తొలి మ్యాచులో 47 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా.. తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచుల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను కలిగించిన విషయం తెలిసిందే
పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో విజయం సాధించిన ఆస్ట్రేలియా కొత్త ఉత్సాహంతో ఉంది. గత అనుభవాల కారణంగా జేమ్స్ ఫాల్కునర్, షేన్ వాట్సన్లు తమ సొంత మైదానంలో ఆడినట్లు భావిస్తున్నారు. టీమిండియా కూడా రెండు మ్యాచుల విజయాలతో ఆత్మ విశ్వాసంతో ఉంది.
అంతేగాక, ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా ఆతిథ్య జట్టుపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం రెండు బలమైన జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు టీమిండియాకు మంచి ఆరంభాన్నిస్తే మన జట్టుకు తిరుగుండదనే చెప్పవచ్చు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా టీమిండియాకు కీలకమే. సురేష్ రైనా, యువరాజ్ సింగ్లు ఫాంలోకి రావాల్సిన అవసరం ఉంది. బంగ్లాతో జరిగిన మ్యాచులో 30 పరుగులు చేసిన రైనా కొంత మెరుగ్గా రాణించాడు.
బౌలర్ల విషయానికొస్తే స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు యువ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక పాండ్యాలు కొంత మేరకు బాగానే రాణిస్తున్నారు. సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా, రేపటి మ్యాచులో స్పిన్నర్లే కీలకం కానున్నారు.
ఆస్ట్రేలియా విషయానికొస్తే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మంచి ఫాంలో ఉండగా, స్టీవ్ స్మిత్, వాట్సన్లు కీలక ఇన్నింగ్స్ చేసే అవకాశముంది. ఆరోన్ ఫింఛ్, డేవిడ్ వార్నర్,మాక్స్ వెల్ లు కూడా ఆస్ట్రేలియాకు కీలకంగా ఉన్నారు.