హైదరాబాద్: ముంబై జట్టు భారత క్రికెట్కు అందించిన అత్యుత్తమ క్రికెటర్లలో ముందుగా వినిపించే పేర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వినోద్ కాంబ్లీ. ఈ జాబితాలో ఇప్పుడు తెరపైకి వచ్చిన పేరు పృథ్వీ షా. ముంబైకి చెందిన ఈ యువ క్రికెటర్ దులీప్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఇండియా రెడ్ తరఫున ఆడి 154 పరుగులు చేశాడు.
దీంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇంతకుముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండడం విశేషం. దీంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా షా అరుదైన ఘనత సాధించాడు.
ఈ ఏడాది ఆరంభంలో రంజీల్లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా 17 ఏళ్ల 57 రోజుల వయసులో తాను ఆడిన తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. ఫృథ్వీ షా.... సచిన్ మరో రికార్డుకు సమీపంలో ఉన్నాడు. 18 ఏళ్ల కంటే ముందే సచిన్ రంజీ, దులీప్, ఇరానీ ట్రోఫీ మూడింటిలోనూ సెంచరీలు సాధించాడు.
ఇప్పటికే రంజీ, దులీప్ట్రోఫీల్లో ఈ ఫీట్ చేరుకున్న పృథ్వీ.. ఇరానీ ట్రోఫీలోనూ సెంచరీ చేస్తే మరోసారి సచిన్ సరసన నిలుస్తాడు. ముంబైలో ఓ స్కూల్ మ్యాచ్లో 330 బంతుల్లో 546 పరుగులు చేశాడు. దీంతో క్రికెట్ అన్ని ఫార్మట్లలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్మన్గా వెలుగులోకి వచ్చాడు.
హారిస్ షీల్డ్లో భాగంగా రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరఫున బరిలో దిగిన షా 14 ఏళ్ల వయసులో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్పై ఈ రికార్డు నెలకొల్పాడు. గతంలో సచిన్ కూడా ఇదే టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియా బ్లూతో సోమవారం ప్రారంభమైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా రెడ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 317 పరుగులు చేసింది.