హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీశాడని టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. 'వాట్ ద డక్2' అనే చాట్ షోలో పాల్గొన్న అశ్విన్ కొన్నేళ్ల క్రితం నెట్స్లో చోటు చేసుకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
'సెహ్వాగ్కు బౌలింగ్ చేయడం ఎప్పుడూ సంక్లిష్టమే. నిజానికి అతను నాపై ప్రతికూల ప్రభావాన్ని చూపాడు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బశాడు' అని అశ్విన్ చెప్పాడు.
'దంబుల్లాలో ఓ ఘటన జరిగింది. అప్పుడు నెట్స్లో నేను వేసిన ప్రతి బంతిని సెహ్వాగ్ అలవోకగా ఎదుర్కొన్నాడు. ఫస్ట్ బాల్ నేను ఔట్సైట్ స్టంప్స్ దిశగా వేశాను. సెహ్వాగ్ కట్ చేశాడు. ఆ తర్వాతి బాల్ స్టంప్స్ దిశగా వేశాను. దాన్నీ కట్ చేశాడు. తర్వాతి బాల్ మిడిల్ స్టంప్స్కు వేయగా.. దానిని కట్ చేసి వదిలేశాడు. ఆ తర్వాతి బాల్ లెగ్ స్టంప్స్కు వేయగా సెహ్వాగ్ అదే రిపీట్ చేశాడు. నాకు ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. ఇక చేసేది ఏమీ లేక ఫుల్ బంతి వేశాను. సెహ్వాగ్ ముందుకొచ్చి దానిని సిక్సర్ కొట్టాడు' అని అశ్విన్ వివరించాడు.
టీమిండియాలో చోటు కోసం అశ్విన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజుల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 'నేను అంత మంచి బౌలర్ను కాదేమో. లేకపోతే అతను చాలామంచి ఆటగాడు అయి ఉంటాడని నాకు నేను చెప్పుకున్నాను. నెట్స్లో సచిన్కు బౌలింగ్ చేసినప్పుడు కూడా నేను ఇంత ఇబ్బంది పడలేదు. కొన్ని రోజులు సెహ్వాగ్ను పరిశీలించిన తర్వాత ఒకరోజు ఉండబట్టలేక నేను మెరుగుపడాలంటే ఏం చేయాలని అతన్నే అడిగాను' అని అశ్విన్ తెలిపాడు.
'అప్పుడు నేను సచిన్ను అడిగి ఉంటే మంచి సలహాలు ఇచ్చేవాడు. ధోనీని అడిగివుంటే దృక్పథం ఎలా ఉండాలో చెప్పేవాడు. కానీ సెహ్వాగ్ మాత్రం 'నేను ఆఫ్ స్పిన్నర్లను బౌలర్లుగా పరిగణించను. వారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేరు. వారిని చితక్కొట్టడం నాకు చాలా సులువు' అని చెప్పాడు' అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని అశ్విన్ వివరించాడు.
'నేను ఓకే అని చెప్పాను. ఆ తర్వాత నేను మళ్లీ వివిధ జోన్స్లో బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించాను. అప్పుడు కూడా సెహ్వాగ్ నా బౌలింగ్ను ఉతికేశాడు. ఆ సమయంలో సెహ్వాగ్ నన్ను 10 ఏళ్ల బాలుడిలా పరిగణించాడు. హర్భజన్ బౌలింగ్లో జ్వరంగా ఉన్నా ఎలా 12 సిక్సర్లు బాదాడో చెప్పాడు' అని అశ్విన్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
'ఆ తర్వాత కొన్ని రోజులు అతడికి బౌలింగ్ చేశా. సరైన బంతులేస్తే సెహ్వాగ్ ఔట్ కాడని తెలుసుకొని చెత్త బంతులు వేసేవాడిని. అప్పుడు అతడు ఇబ్బంది పడేవాడు. అలా టీ20ల్లో అతడిని అవుట్ చేశా. సెహ్వాగ్ జట్టు సమావేశాల పట్ల కూడా ఆసక్తి ప్రదర్శించేవాడు కాదు. ముందు గ్యారీ కిర్స్టన్, ధోనీ మాట్లాడేవారు. సెహ్వాగ్ ఏం మాట్లాడకుండా అంతా బాగుందనేవాడు. దాంతో సమావేశం ముగిసేది' అని అశ్విన్ అన్నాడు.