హైదరాబాద్: రాంచీ టెస్టులో గెలుపు దిశగా సాగుతున్నామని సెంచరీ వీరుడు వృద్ధిమాన్ సాహా చెప్పుకొచ్చాడు. రాంచీ టెస్టులో నాలుగు రోజు ఆటలో సాహా 233 బంతుల్లో 117 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో సాహాకి ఇది మూడో సెంచరీ. మ్యాచ్ అనంతరం సాహా మీడియాతో మాట్లాడాడు.
రాంచీ టెస్టు గెలుపెవరిది?: లంచ్ విరామానికి ఆసీస్ 83/4
తన కెరీర్లో ఇప్పటివరకు సాధించిన మూడు సెంచరీల్లో ఇదే అత్యుత్తమమైనదిగా అభివర్ణించాడు. పుజారాతో కలిసి 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినందుకు గర్వంగా ఉందని చెప్పాడు. మా భాగస్వామ్యం నెమ్మదిగా మొదలై పుజారా డబుల్ సెంచరీ, తాను సెంచరీ సాధించే దిశగా సాగడం ఆనందంగా ఉందని తెలిపాడు.
ఇద్దరం సానుకూలంగా ఆడామని సాహా చెప్పాడు. తన బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు చేసుకోలేదని, అయినా సరే బ్యాటింగ్ మెరుగుపడినట్లు భావిస్తున్నాని చెప్పాడు. గతంలో స్వీప్, ఫ్రంట్ఫుట్ షాట్లు ఆడేటప్పుడు కొన్ని సందేహాలు వచ్చేవని, అయితే ఆటలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపాడు.
జట్టు తనకు పూర్తి మద్దతు ఇస్తుందని, ఇది తన బ్యాటింగ్పై మంచి ప్రభావం చూపుతుందన్నాడు. పుజారా ఎంతో ఓపికతో ఆడాడని, అతనికి డబుల్ సెంచరీలు చేయడం సర్వసాధారణమని అన్నాడు. దేశవాళీ క్రికెట్లో పుజారా చాలాసార్లు 200-300 పరుగులు సాధించాడని సాహా తెలిపాడు.
రాంచీ టెస్టులో నమోదైన రికార్డులివే (ఫోటోలు)
పుజారా ఒక వైపు సహచరులు అవుటవుతున్నా చక్కటి షాట్లతో బ్యాటింగ్ చేశాడని, దీంతో ఓ మంచి భాగస్వామ్యం నమోదు చేశామని పేర్కొన్నాడు. ఆసీస్ బౌలర్ హాజల్వుడ్ స్లెడ్జింగ్కు పాల్పడ్డాడని అయితే మేము దానిపై స్పందించలేదని సాహా తెలిపాడు.
హాజల్వుడ్ తనతో ఎదో చెప్పాలని ప్రయత్నిస్తే వెనక్కి వెళ్లి బౌలింగ్ చేయమని సూచించానన్నాడు. ఇక పుజారా కూడా హాజల్వుడ్తో స్కోరు బోర్డు చూడమని చెప్పిన సంగతి తెలిసిందే. చివర్లో జడేజా మెరుపు అర్ధసెంచరీతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్పై 152 పరుగుల ఆధిక్యం నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9 వద్ద డిక్లేర్ చేసింది.