హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సాధించాడు. టీ విరామానికి ఆస్ట్రేలియా 60 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ 80, మ్యాక్స్వెల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ క్రమంలో మూడో టెస్టులో 80 పరుగులు చేసిన సెంచరీకి చేరువలో ఉన్న స్టీవ్ స్మిత్ ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 53 టెస్టు మ్యాచ్లాడిన 97 ఇన్నింగ్స్ల్లో స్మిత్ అరుదైన ఘనతను సాధించాడు. తద్వారా టెస్టుల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసిన ఏడో ఆటగాడిగా స్మిత్ రికార్డు సృష్టించాడు.
రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్ 57.5వ ఓవర్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ ఒక పరుగు తీసి ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్మిత్ 27 సంవత్సరాల 287 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.
ఇప్పటి వరకూ ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరిట ఉండేంది. పాంటింగ్ 28 ఏళ్ల 303 రోజుల వయసులో టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తర్వాతి స్థానాల్లో డాన్ బ్రాడ్మ్యాన్ (29 ఏళ్ల 330 రోజులు), అలెన్ బోర్డర్ (29 ఏళ్ల 340 రోజులు)లు ఉన్నారు.
ఇక మొత్తం ప్రపంచ క్రికెటర్ల విషయానికి వస్తే చిన్న వయసులో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్ రికార్డు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 25 ఏళ్ల 298 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (26 ఏళ్ల 9 రోజులు) ఉన్నాడు.
అతడి తర్వాత గ్రేమ్ స్మిత్ (27 ఏళ్ల 29 రోజులు), జావెద్ మియాందాద్ (27 ఏళ్ల 242 రోజులు) ఉన్నారు. కాగా, ప్రస్తుతం 64 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది.
Onya, skipper! @stevesmith49 pushes a single to bring up 5000 Test runs in just his 97th innings.
— cricket.com.au (@CricketAus) 16 March 2017
What a player #INDvAUS pic.twitter.com/qoMqBj0G6r