హైదరాబాద్: ముంబైకి చెందిన 17 ఏళ్ల ఓపెనర్ పృధ్వీ షా అరుదైన ఘనతను సాధించాడు. అరంగేట్రం చేసిన రంజీ మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. దీంతో సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్న ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో ఐదో రోజు సెంచరీ సాధించి ముంబై తరుపున అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీ సాధించిన 13వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. పృధ్వీ షా 99 పరుగుల వద్ద క్రీజులో ఉన్నప్పుడు బౌలర్ విజయ శంకర్ నో బాల్ వేశాడు.
దీంతో పృధ్వీ షా 152 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. అయితే ముంబై జట్టు విజయానికి 10 పరుగుల దూరంలో ఉన్న సమయంలో 120 పరుగుల (175 బంతులు, 13 ఫోర్లు, ఒక సిక్సు) వ్యక్తిగత స్కోరు వద్ద పృధ్వీ షా పెవిలియన్కు చేరాడు.
పృధ్వీ షా 14 ఏళ్ల వయసులో ముంబైలో హార్రిస్ షీల్డ్ స్కూల్ మ్యాచ్లో 546 పరుగులతో వరల్డ్ రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత్లో యువ ఆటగాళ్లలో ఒకడిగా సత్తా చాటుతూనే ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్గా ఉన్న అండర్-19 జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు.
రంజీ సెమీస్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా కెవిన్ అల్మీడియా స్ధానంలో ముంబై జట్టులో షా పిలుపు అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల వద్ద అవుటై నిరాశపర్చిన షా రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించి ముంబై జట్టుని ఫైనల్స్కు చేర్చాడు.
దీంతో షాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 251 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నాలుగు వికెట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించి ఫైనల్స్కు అర్హత సాధించింది. జనవరి 10న ఇండోర్లో జరగనున్న రంజీ ఫైనల్స్లో గుజరాత్ జట్టుతో ముంబై తలపడనుంది.