టోర్నీ ఫైనల్లో భారత్-పాక్ తలపడాలి
'ఈ రెండు మ్యాచుల్లో భారత్, పాకిస్థాన్ విజయం సాధించి ఛాంపియన్స్ టోర్నీ ఫైనల్లో తలపడాలని కోరుకుంటున్నా. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు' అని లతీఫ్ తెలిపాడు. లీగ్లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్ జట్టుకు అండగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
ఇంగ్లాండ్పై పాక్ విజయం సాధించాలి
'గతంలో చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకుని సెమీస్లో ఇంగ్లాండ్పై పాక్ విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత ఫైనల్లో పాకిస్థాన్... భారత్తో ఆడాలి. అభిమానులకు ఇంతకన్నా ఏం కావాలి. యావత్తు ప్రపంచం మొత్తం ఇదే కోరుకుంటోంది. క్రికెట్ అనేది ఒక పవర్. దీన్ని చాలా మంది ఆడతారు, చూస్తారు, ఇష్టపడతారు' అని పేర్కొన్నాడు.
భారత జట్టుకు అభినందనలు
'సెమీ ఫైనల్కు చేరిన భారత జట్టుకు అభినందనలు. వారికి ఫైనల్ వెళ్లే అవకాశం మెండుగా ఉంది. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్. కుంబ్లే నిజాయతీ గల వ్యక్తి. నా కెరీర్లో కుంబ్లేని ఎదుర్కొన్నాను. కుంబ్లేతోపాటు హర్భజన్ సింగ్, యువీ, సచిన్, గంగూలీ, జడేజా, అజారుద్దీన్, శ్రీకాంత్, శ్రీనాథ్ అందరికీ ఈ సందర్భంగా లతీఫ్ శుభాకాంక్షలు తెలిపాడు.
మీడియా వివాదాస్పద వ్యాఖ్యల కోసం ఎదురుచూపు
‘ఇండియా, పాకిస్థాన్ మీడియాలు వివాదాస్పద వ్యాఖ్యల కోసం ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే తమ ఛానళ్లకు హిట్స్ పెంచుకునేందుకు. అలాంటి వాటి గురించి పట్టించుకోకండి' అని లతీఫ్ వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపాడు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
అసలు వివాదానికి కారణం
అసలు వివాదానికి కారణం ఏంటంటే... ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై భారత్ 124 పరుగుల తేడాతో నెగ్గిన అనంతరం కంగ్రాట్స్ భారత్.. బాప్ బాప్ హోతా హై అని, బంగ్లాదేశ్పై ప్రాక్టీస్ మ్యాచ్లో నెగ్గినట్లుగా భారత్ అలవోకగా విజయం సాధించిందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీంతో సెహ్వాగ్ చేసిన ట్వీట్పై లతీఫ్ తీవ్ర స్థాయిలో స్పందించాడు. సెహ్వాగ్ను కించపరిచేలా ట్వీట్లు చేసిన లతీఫ్ అలాగే ఓ వీడియోను పోస్ట్ చేశాడు. లతీఫ్ కామెంట్లపై స్పందించిన సెహ్వాగ్.. 'చెత్త వాగుడు కంటే.. అర్థానిచ్చే నిశ్శబ్ధం మంచిదేనని' ట్వీట్ చేశాడు. ఆ తర్వాత లతీఫ్ కామెంట్లపై టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దీంతో లతీఫ్ వెనక్కి తగ్గి వీడియోని పోస్టు చేశాడు.