హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో కోహ్లీసేన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంకో టెస్టు మిగిలుండగానే 2-0తో సిరిస్ను కైవసం చేసుకుంది.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 22/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా టెస్టుల్లో 29వ సారి 600కుపైగా పరుగుల మార్కును భారత్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ ఘనతను భారత్ కంటే ఆసీస్ మూడుసార్లు అధికంగా సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు 32 సార్లు 600కు పైగా పరుగుల మార్కును అందుకుని ప్రపంచ రికార్డుని సాధించింది. అయితే ఈ రికార్డుని అధిగమించే సత్తా కోహ్లీసేనకు ఉందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
'అత్యధిక సార్లు 600కుపైగా పరుగులు చేసిన ఆసీస్ రికార్డుని టీమిండియా అధిగమిస్తుంది. ప్రస్తుత జట్టు ఈ రికార్డును కచ్చితంగా అధిగమిస్తుంది. ఆసీస్ వరల్డ్ రికార్డును అధిగమించటానికి స్వల్ప దూరంలో ఉన్నాం. నా రెండేళ్ల పర్యవేక్షణలో ఆసీస్ సాధించిన రికార్డును భారత్ బద్దలు కొడుతుంది. కాకపోతే ఏ సమయంలోనే అనేది మాత్రం చెప్పలేను' రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లలో టీమిండియా ఒకటి. కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే లాంటి అత్యుత్తమ ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆఖరి టెస్టు ఆగస్టు 12వ తేదీన పల్లెకెలెలో ప్రారంభం కానుంది.