రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో గుజరాత్ లయన్స్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆడటం లేదు. ఎందుకంటే ఆదివారమే అతని వివాహం రీవా సోలంకితో జరగనుంది.
'ఆదివారం రవీంద్ర జడేజా వివాహం జరగనున్న నేపథ్యంలో అతను శనివారం ముంబైతో జరిగే మ్యాచ్ లో ఆడటం లేదు' అని గుజరాత్ లయన్స్ టీం పేర్కొంది.
'ఏప్రిల్ 21న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్ లో రవీంద్ర జడేజా పాల్గొంటాడో లేదో ఇప్పుడే చెప్పలేం' అని తెలిపింది. రవీంద్ర జడేజా సొంత రాష్ట్రంలోని రాజ్కోట్లోనే ఈ మ్యాచ్ జరుగుతుండటంతో అతడు పాల్గొనే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
కాగా, రవీంద్ర జడేజా ప్రాతినిథ్యం వహిస్తున్న కొత్త జట్టు గుజరాత్ లయన్స్ వరుసగా రెండు విజయాలతో మిగితా జట్ల కంటే ముందే ఉంది. రైజింగ్ పుణె జట్టుతో జరిగిన మ్యాచ్ లో 2 కీలక వికెట్లు తీయడమే గాకుండా 18 పరుగులు చేసిన జడేజా.. గుజరాత్ లయన్స్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
కాగా, గుజరాత్ లయన్స్ జట్టు సభ్యులు కూడా రవీంద్ర జడేజా వివాహానికి హాజరవుతారని సమాచారం. వీరితోపాటు టీమిండియా మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.