హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో నాలుగువేల పరుగుల క్లబ్లో చేరిన నాలుగో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ నాలుగు వేల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో నాలుగు వేల పరుగుల క్లబ్లో సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, గౌతం గంభీర్లు మాత్రమే ఉండగా వారి సరసన తాజాగా రోహిత్ శర్మ చేరాడు.
2008 నుంచి ఇప్పటివరకూ 152 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 33.17 యావరేజితో 30 అర్ధ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత స్కోరు 109 నాటౌట్గా ఉంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు అవసరాల మేరకు ఓపెనర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బ్యాటింగ్లో సత్తా చాటుతున్నాడు.
కాగా రోహిత్ శర్మ స్ట్రయిక్ రేట్ 130.84గా ఉంది. గతేడాది గాయంతో టీమిండియాకు దూరమైన రోహిత్ శర్మ.. ఐపీఎల్లో సత్తాచాటి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కు చేరుకుంది.
ఐపీఎల్ పదో సీజన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి ఏడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ ఆ జట్టుని రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు.