హైదరాబాద్: తన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ 1999లో ఆడిన ఆస్ట్రేలియా పర్యటనే అత్యంత కఠినమైనదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పాడు. ఆ సిరిస్లో ఆడిన జట్టులో ఎనిమిదిమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, అలాంటి జట్టును తన కెరీర్లో ఎప్పుడూ ఎదుర్కోలేదని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
'ఎంతో కఠినమైన సిరీస్ ఏదంటే.. నిస్సందేహంగా 1999 ఆసీస్ పర్యటనే. ఆ సమయంలో ఆసీస్ టీమ్ చాలా బలంగా ఉంది. 11 మందిలో ఏడు, ఎనిమిది మంది మ్యాచ్ విన్నర్లే. రిజర్వ్ బెంచ్ కూడా మ్యాచ్ విన్నర్లే. ఇదే జట్టు కొన్ని ఏండ్లపాటు ప్రపంచ క్రికెట్ను శాసించింది. ఎంతో దూకుడుగా తమదైన శైలిలో ఆడేవారు' అని మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ చెప్పాడు.
స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా 3-0తో టీమిండియాను వైట్ వాష్ చేసింది. ఆడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 285 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మెల్ బోర్న్లో జరిగిన రెండో టెస్టులో 180 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది.
సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో భారత్పై ఆసీస్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. 'మెల్ బోర్న్, అడిలైడ్, సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టు ఆడిన క్రికెట్ యావత్ ప్రపంచం ముగ్దురాలైంది. ప్రతి ఒక్కరూ అలాంటి అద్భుతమైన క్రికెట్ ఆడాలని కోరుకున్నారు' అని సచిన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.