హైదరాబాద్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీశాంత్పై బీసీసీఐ విధించిన నిషేధాన్ని కేరళ హైకోర్టు సోమవారం ఎత్తివేసింది. గతేడాది ఢిల్లీలోని ట్రయల్ కోర్టు కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ను నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పు తర్వాత తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని శ్రీశాంత్ బీసీసీఐని కోరినప్పటికీ బోర్డు తిరస్కరించింది. దీంతో శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు క్లీన్చిట్ ఇచ్చినా బోర్డు తనను కావాలని వేధిస్తోందని పిటిషన్ వేశాడు.
కోర్టులో అతడు నిర్దోషిగా తేలినా బోర్డు ఎలా నిషేధిస్తుంది? సహజ న్యాయాన్ని తిరస్కరించడమే అవుతుందని తీర్పు సందర్భంగా కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో శ్రీశాంత్తోపాటు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చవాన్లను స్పాట్ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ శ్రీశాంత్పై నిషేధం విధించింది. దీంతో పాటు స్కాట్లాండ్ క్రికెట్ లీగ్ 2017లో ఆడేందుకు చూసిన శ్రీశాంత్కి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయడానికి బీసీసీఐ నిరాకరించింది. తాజా హైకోర్టు తీర్పుపై శ్రీశాంత్ ట్విట్టర్లో ఆనందం వ్యక్తంచేశాడు.
God is great..thanks for the all the love and support pic.twitter.com/THyjfbBSFv
— Sreesanth (@sreesanth36) 7 August 2017