హైదరాబాద్: టీమిండియా పేసర్ శ్రీశాంత్ వ్వవహారంలో మరో కీలక మలుపు తీసుకుంది. భారత జట్టు తరుపున తిరిగి ఆడాలన్న అతడి కోరిక ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. శ్రీశాంత్పై బీసీసీఐ విధించి జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసేందుకు బీసీసీఐ ఇష్టపడటం లేదు.
లక్ష్యం 2019 వరల్డ్ కప్: నిషేధం ఎత్తివేత అనంతరం శ్రీశాంత్
నిషేధాన్ని ఎత్తివేయాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఫిక్సింగ్ ఆరోపణల నుంచి శ్రీశాంత్కు కేరళ హైకోర్టు ఊరట కల్పిస్తూ రెండు రోజు క్రితం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ తీర్పుపై కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఐపీఎల్ 2013లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై బోర్డు శ్రీశాంత్పై జీవితకాలం నిషేధం విధించింది. ఢిల్లీలోని ట్రయల్ కోర్టు కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ను నిర్దోషిగా తేల్చినప్పటికీ... బీసీసీఐ మాత్రం నిషేధం తొలగించలేదు. దీంతో శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.
కోర్టు క్లీన్చిట్ ఇచ్చినా బోర్డు తనను కావాలని వేధిస్తోందని పిటిషన్ వేశాడు. దీంతో కేరళ హైకోర్టు శ్రీశాంత్పై నిషేధం తొలగించాలని ఆదేశించింది. కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును బీసీసీఐ న్యాయ బృందం పరిశీలించింది. అధ్యయనం అనంతరం బీసీసీఐ న్యాయ విభాగం ఈ కేసును డివిజన్ బెంచ్కు అప్పీల్ చేయాలని నిర్ణయించింది.
'కోర్టు తీర్పు ప్రతిని మా లీగల్ టీమ్ పరిశీలించింది. నిబంధనల ప్రకారం దీనిపై డివిజనల్ బెంచ్ ముందు అప్పీల్ చేసుకునే హక్కు మాకు ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. క్రికెట్లో ఏమాత్రం అవినీతిని సహించమని చెప్పేందుకే ఇలా చేస్తున్నామని ఆయన వివరించారు.