హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను ఓడించడం ఆస్ట్రేలియా వల్ల కాదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్ను కోహ్లీసేన 5-0తో సిరిస్ను కైవసం చేసుకుంటుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.
అంతేకాదు ఆసీస్ దిగ్గజ కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్లు వచ్చి కెప్టెన్సీ చేసినా ప్రస్తుత భారత జట్టును ఓడించడం వారి వల్ల సాధ్యం కాదని సెహ్వాగ్ అన్నాడు. 'ప్రస్తుత టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. అదే సమయంలో ఆసీస్ క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. వన్డే సిరీస్ భారత్ వైట్ వాష్ చేయడం ఖాయం' అని సెహ్వాగ్ అన్నాడు.
'భారత పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టుకు స్టీవ్ వా, రికీ పాంటింగ్ కెప్టెన్లుగా వ్యవహరించినా ఆ జట్టు పేలవప్రదర్శనను మాత్రం ఆపలేరు. ఆసీస్ జట్టులో పోరాట స్ఫూర్తి అస్సలు లేదు. దానికి తగ్గట్టే బలహీనంగా ఉంది. ఆసీస్ను క్లీన్ స్వీప్ చేయడం భారత్కు ఎంతమాత్రం కష్టం కాదు. అదే జరుగుతుందని ఆశిస్తున్నా' అని సెహ్వాగ్ తెలిపాడు.
ఇక ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో కౌల్టర్ నైల్ తప్ప మిగతా బౌలర్లంతా అలంకార ప్రాయంగానే ఉన్నారని సెహ్వాగ్ అన్నాడు. ఇక బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్ వెల్ను తొందరగా అవుట్ చేస్తే ఇక ఆ జట్టు తేరుకోవడం కష్టమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.