న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాదు ఐపిఎల్ 9వ ఎడిషన్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది. గుజరాత్ లయన్స్పై హైదరాబాద్ శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచులో విజయం సాధించింది. లీగ్ దశలో రెండు విజయాలు నమోదు చేసుకున్న హైదరాబాద్ అదే జోరును కొనసాగిస్తూ కీలకమైన క్వాలిఫయర్-2లోనూ గుజరాత్ను చిత్తుచేసింది.
శుక్రవారం జరిగిన ఫైనల్ బెర్తు రెండో జట్టు కోసం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యఛేదనలో వార్నర్(58 బంతుల్లో 93 నాటౌట్, 11ఫోర్లు, 3సిక్స్లు) దూకుడుతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.
శివిల్కౌశిక్(2/22), బ్రావో(2/32) రెండేసి వికెట్లతో రాణించారు. మెరుపు అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన వార్నర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. గుజరాత్ విధించిన లక్ష్యఛేదనలో కెప్టెన్ వార్నర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. తోటి బ్యాట్స్మెన్ నుంచి సహకారం లభించకపోయినా గెలుపు కోసం కడదాకా పోరాడి చివరికి విజయం సాధించాడు.
తొలుతు గుజరాత్ బౌలింగ్ దాడికి హైదరాబాద్ ఇన్నింగ్స్ కుదేలైంది. కౌశిక్, బ్రావో బౌలింగ్ ధాటికి హైదరాబాద్ ఇన్నింగ్స్ ఓ దశలో 84 పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయి ఓడిపోయే దశకు చేరుకుంది. ధావన్(0), హెన్రిక్స్(11), యువరాజ్సింగ్(8), దీపక్హుడా (4), కట్టింగ్(8) ఒక్కరొక్కరే పెవిలియన్ దారి పడుతూ వచ్చారు.
ఆ దశలో వార్నర్, నమన్ ఓఝా(10), బిపుల్శర్మ(11 బంతుల్లో 27 నాటౌట్, 3సిక్స్లు)తో కలిసి జట్టును విజయం వైపు నడిపించాడు. ఓటమి ఖాయమనుకున్న క్రమంలో బిపుల్శర్మతో కలిసి వార్నర్ పోరాటం చేశాడు. ముఖ్యంగా బ్రావో వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లకు తోడు బిపుల్ ఓ సిక్స్ కొట్టి 19 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ ఫలితం మారిపోయిది. ఆఖరి 6 బంతుల్లో విజయానికి 5 పరుగులు అవసరమైన దశలో వార్నర్ ఓఫోర్, సింగిల్తో జట్టును ఫైనల్కు చేర్చాడు.
తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్..ఫించ్(50) బాధ్యతాయుత అర్ధసెంచరీతో నిర్ణీత ఓవర్లలో 7వికెట్లకు 162 పరుగుల స్కోరు నమోదు చేసింది. భువనేశ్వర్(2/27), బెన్కట్టింగ్(2/20) రెండేసి వికెట్లతో రాణించారు. రైనా కెప్టెన్సీలోని గుజరాత్ లయన్స్ బ్యాట్స్మెన్ తడబడుతూ వచ్చారు. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ద్వివేది(5) క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు. ద్వివేది తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ రైనా(1) కూడా తొందరగానే పెవిలియన్ బాట పట్టాడు.
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బౌల్ట్ బౌలింగ్లో రైనా వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. మెకల్లమ్(32) అప్పుడప్పుడు బౌండరీలు బాదడంతో పవర్ప్లే ముగిసే సరికి గుజరాత్ 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. ఈ క్రమంలో దినేశ్కార్తీక్(26)తో కలిసి మెకల్లమ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.
వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే గాడిలో పడిందనుకున్న గుజరాత్ ఇన్నింగ్స్కు మరో దెబ్బ తగిలింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న కార్తీక్ రనౌట్గా వెనుదిరిగాడు. కట్టింగ్ బౌలింగ్లో మెకల్లమ్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత స్మిత్(1) కూడా నిష్క్రమించడంతో లయన్స్ 20 పరుగుల తేడాతోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఫించ్(32 బంతుల్లో 50), జడేజా(19నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నారు.
తోటి బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్ చేరుతున్నా జడేజాతో కలిసి హైదరాబాద్కు గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో ఫించ్ కీలకయ్యాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బిపుల్ శర్మ బౌలింగ్లో ఫించ్ ఇచ్చిన క్యాచ్ను స్రాన్ విడిచిపెట్టడంతో లయన్స్కు అదృష్టం కలిసొచ్చింది. తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్న ఫించ్ తన ఇన్నింగ్స్లో 7ఫోర్లు, 2 సిక్స్లతో చెలరేగాడు.
జడేజాతో కలిసి ఫించ్ 4.5 ఓవర్లలో ఆరో వికెట్కు 51 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫించ్ తర్వాత వచ్చిన బ్రావో(10 బంతుల్లో 20) బ్యాటు ఝులిపించడంతో గుజరాత్ 162 పరుగుల స్కోరు సాధించింది. భువనేశ్వర్(2/27), కట్టింగ్(2/20) రెండు వికెట్లతో రాణించగా, బౌల్ట్(1/39), బిపుల్శర్మ(1/21) ఒక్కో వికెట్ తీశారు.