2-0తో సిరిస్ను కైవసం
ఈ విజయంతో మరో టెస్టు మిగిలుండగానే 2-0తో సిరిస్ను కైవసం చేసుకుంది. ఈ సిరిస్ విజయంతో శ్రీలంక గడ్డపై రెండు టెస్ట్ సిరీస్లు గెలిచిన తొలి భారత కెప్టెన్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2015లో మొదటిసారి 2-1తో లంకపై సిరిస్ గెలిచిన కోహ్లీ సేన తాజా టెస్టు సిరిస్ను కైవసం చేసుకుంది.
అంకుల్ పెర్సికి కోహ్లీసేన అరుదైన కానుక
ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు అనంతరం శ్రీలంక జట్టు సూపర్ ఫ్యాన్ అంకుల్ పెర్సికి కోహ్లీసేన అరుదైన కానుకను అందజేసింది. ఇంతకీ అంకుల్ పెర్సి ఎవరా అనుకుంటున్నారా! టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని గ్యాలరీలో భారత క్రికెటర్లను ఉత్సాహపరచడం మనం చూశాం.
అంకుల్ పెర్సి వయసు 81 ఏళ్లు
అదే విధంగా శ్రీలంకకు అంకుల్ పెర్సి. అంకుల్ పెర్సి వయసు 81 ఏళ్లు. ఈ వయసులో కూడా శ్రీలంక ఎక్కడ మ్యాచ్ ఆడినా ఆ దేశ జాతీయ పతాకంతో సందడి చేస్తుంటాడు. పెర్సికి టీమిండియా అంటే కూడా గౌరవం. అంతేకాదు భారత జట్టులో కోహ్లీ, రహానె, రైనా, రవిశాస్త్రి తదితరులంటే చెప్పలేనంత ఇష్టం.
ఆగస్టు 12న పల్లెకెలెలో మూడో టెస్టు
ఈ క్రమంలోనే గాలెలో తొలి టెస్టు అనంతరం కోహ్లీ, ధావన్.. పెర్సిని కలిసి ముందస్తుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్ రవిశాస్త్రి సంతకం చేసిన జెర్సీని శాస్త్రి.. పెర్సికి అందించాడు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఆగస్టు 12న పల్లెకెలెలో ప్రారంభం కానుంది.