హైదరాబాద్: ధోనీ అద్భుతమైన ఆటగాడు, గొప్ప వ్యక్తిత్వం కలవాడని టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాయి. భారత జట్టు నుంచి గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు వైదొలగడానికి ధోనినే కారణమంటూ గతంలో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ధోనితో గంభీర్కు విభేదాలు ఉండటం వల్లే అతడికి జట్టులో చోటు దక్కడం లేదన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో ధోనితో తనకు విభేదాలు ఉన్నాయని, అదే కారణంగా తాను జట్టుకు దూరమయ్యానని గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న వార్తలను గౌతం గంభీర్ కొట్టిపారేశాడు.
సుమారు రెండేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టెస్టు సిరిస్తో జట్టులో గంభీర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫేస్బుక్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ధోనితో తనకున్న సంబంధాలపై కూడా గంభీర్ స్పందించాడు.
ధోనీతో తనకు ఎటువంటి విరోధం లేదని స్పష్టం చేశాడు. తన ఉద్దేశంలో జట్టుకు ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ భారత్ గెలవడమే మన అంతిమ లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. కుటుంబ సభ్యులతో సహా పలువురితో విభిన్న అభిప్రాయాలు ఉండటం చాలా సహజమని చెప్పాడు.
'ఒకే చోట కలిసి ఉన్నప్పుడు అది కుటుంబం అయినా మరో చోట అయినా జీవితంలో చాలా మంది అభిప్రాయాల్లో తేడాలు ఉండటం సహజం. అంతే గానీ అదేమీ వైరంలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు. మేం కలిసి ఆడిన ప్రతీసారి సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నా... చివరకు జట్టును గెలిపించడమే లక్ష్యంగా ఆడాం. అతనో గొప్ప ఆటగాడు, మంచి మనిషి. టి20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ విజయాలవంటి చిరస్మరణీయ జ్ఞాపకాలు మేమిద్దరం కలిసి పంచుకున్నాం' అని గంభీర్ స్పష్టం చేశాడు.