న్యూఢిల్లీ: ప్రపంచ కప్ టీ20 టోర్నీలో భాగంగా శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచులో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేసింది 24 పరుగులే అయినా భారత విజయంలో అవి కీలక ఇన్నింగ్సే. సరైన సమయంలో పరుగులు చేసిన యువరాజ్ భారత విజయంలో తన పాత్ర పోషించాడు. అయితే, కీలక సమయంలో తను ఔటవడం పట్ల యువీ కొంత నిరాశకు గురయ్యాడు.
అవసరమైన సమయంలోనే బాగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లు యువరాజ్ తెలిపాడు. పరిస్థితులకు తగినట్లుగా ఆడేందుకు తాను ప్రయత్నిస్తానని తెలిపాడు. ఆ సందర్భంగా పెద్దదా? చిన్నదా అనేది అవసరం లేదు. బంతిని చూసి బాదేయాలనే తాను చూసినట్లు తెలిపాడు.
అయితే, అనుకోకుండా తాను ఔటవడం కొంత నిరాశకు గురిచేసిందని యువరాజ్ తెలిపాడు. దీంతో తాను ఆటను ముగించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. మంచి ఫాంలో ఉన్న కోహ్లీ బాగా ఆడాడని, కెప్టెన్ ధోనీ ఆటను విజయంతో ముగించేశాడని బిసిసిఐ.టీవీతో అన్నాడు.
'నేను కొన్ని బంతులు నెమ్మదిగా ఆడతా. ఆ తర్వాత నా శైలిలో చెలరేగిపోతా. న్యూజిలాండ్ ఓటమి తమను కొంత ఒత్తిడికి గురిచేసింది. మేం ఆ మ్యాచులో అనుకున్నంతగా ఆడలేకపోయాం. పాక్ మ్యాచులో విరాట్ అర్ధశతకం పూర్తి చేసి జట్టు విజయానికి బాటలు వేశాడు' అని యువరాజ్ తెలిపాడు.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో భారత్ విజయం సాధించడం పట్ల యువరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ జట్టుతో తదుపరి మ్యాచులో ఆత్మవిశ్వాసంతో ఆడే అవకాశం వచ్చిందని తెలిపాడు.
ఇక తమ జట్టు మంచి ఫాంతో ముందుకు వెళుతుందని చెప్పాడు. పాక్ మ్యాచులో భారత బౌలర్లు బాగా రాణించారని, 18 ఓవర్లలో 118 పరుగులకే పరిమితం చేశారని అన్నాడు.