న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఊహించని ప్రశంస అందుకున్నాడు. పాకిస్థాన్ చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ కోహ్లీ బ్యాటింగ్ తీరుకు తాను ముగ్ధుడైనట్లు వెల్లడించాడు. ద టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు చూసేందుకు చక్కగా ఉంటుందని కొనియాడాడు. 'విరాట్ కోహ్లి ఆటను నేను చాలా ఇష్టపడతాను. కోహ్లి బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తుంటే నేను అలానే కూర్చుండిపోతాను. రెండేళ్ల క్రితం అడిలైడ్లో కోహ్లి చేసిన 141 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ నాకు ఇప్పటికీ గుర్తుంది. తొలి ఇన్నింగ్స్లో అతడు 115 పరుగులు చేశాడు. నేను చూసిన క్రికెటర్లలో కోహ్లినే అత్యుత్తమం' అని ఆర్థర్ వివరించాడు.
'కోహ్లీ కెప్టెన్సీ ఎంతో ఆసక్తితో కూడుకుని ఉంటుంది. తాను చేసే ప్రతి పనిలో ఉత్సుకతను చూపిస్తాడు. ఆట పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తాడు' అని ఆర్ధర్ తెలిపాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ క్రికెటర్ ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్ కోచ్గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
కాగా ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన మూడు టెస్టుల మ్యాచ్ల సిరిస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంది. ఇండోర్లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. టీమిండియా కెప్టెన్లలో తొలి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.